మణిపూర్లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, అనంతరం వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా, ఈ ఘటనను సర్వోన్నత న్యాయస్థానం సుమోటాగా స్వీకరించింది. ఇది తమను తీవ్రంగా కలిచివేసిందని, ఇటువంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే.. తామే తీసుకుంటామని హెచ్చరించింది. ఈ అమానవీయ ఘటనకు పాల్పడినవారిపై చర్యలు, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరంగా జులై 28లోగా నివేదిక అందజేయాలని కేంద్రం, మణిపూర్ ప్రభుత్వాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఆదేశించింది.
ఈ వీడియో మే నెలలోది కావచ్చు, కానీ దాని వల్ల ఎలాంటి తేడా లేదని సీజేఐ వ్యాఖ్యానించారు. ‘నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలపై చాలా బాధపడ్డాం..తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాం.. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది... ఇది ఆమోదయోగ్యం కాదు.. ప్రభుత్వం చర్య తీసుకోకపోతే, మేం తీసుకుంటాం.. అటువంటి హింసకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను కోర్టుకు తప్పక తెలియజేయాలని మేము భావిస్తున్నాం.. మీడియాలో చిత్రీకరించిన, కనిపించిన విజువల్స్ స్థూలంగా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘన కిందకే వస్తాయి’ అని సీజేఐ చంద్రచూడ్ ఘాటుగా హెచ్చరించారు.
కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ‘ఈ ఘటనపై ప్రభుత్వం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.. ఇలాంటి సంఘటనలు పూర్తిగా ఆమోదయోగ్యం కాదు.. వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే నేరస్థులను పట్టుకోడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.’ అని తెలిపారు. కాగా, మణిపూర్ రాజధాని ఇంఫాల్కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్పోక్పి జిల్లాలో మే 4న ఈ హేయమైన సంఘటన జరిగినట్లు ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ (ఐటీఎల్ఎఫ్) ఆరోపించింది.
అంతకు ముందు ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది 140 కోట్ల మంది భారతీయులను సిగ్గుపడేలా చేసిందని అన్నారు. ‘మణిపూర్ ఘటన 140 కోట్ల మంది భారతీయులను సిగ్గుపడేలా చేసింది.. నిందితులను వదలి పెట్టబోమని నేను భారత ప్రజలకు భరోసా ఇస్తున్నాను’ అని పార్లమెంట్ సమావేశం ప్రారంభానికి ముందు వ్యాఖ్యానించారు.
మణిపూర్లో మైతీలు, గిరిజన ఆదివాసీల మధ్య ఎస్టీ రిజర్వేషన్ల అంశం చిచ్చురేపిన విషయం తెలిసిందే. మణిపూర్ హైకోర్టు ఆదేశాలతో అక్కడ ప్రభుత్వం మైతీలకు అనుకూలంగా కేంద్రానికి నివేదిక సమర్పించడమే అల్లర్లకు కారణం. మే మొదటి వారం నుంచి ఆ రాష్ట్రంలో హింస కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మే 4న ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, సామూహిక లైంగిక దాడికి పాల్పడిన వీడియో బుధవారం (జులై 19న) వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ప్రధాన నిందితుడ్ని తౌబుల్ జిల్లాలో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అటు, ట్విట్టర్ సహా ఇతర సోషల్ మీడియాల నుంచి వీడియోను తొలగించాలని కేంద్రం ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa