ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సామాన్యుడిలా కేరళ మాజీ సీఎం అంత్యక్రియలు

national |  Suryaa Desk  | Published : Thu, Jul 20, 2023, 09:11 PM

కేన్సర్ వ్యాధితో బాధపడుతోన్న కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ.. గత కొన్ని నెలలుగా బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అంతకు ముందు ఈ వ్యాధికి చికిత్స కోసం జర్మనీ వెళ్లొచ్చారు. అక్కడ నుంచి తిరిగొచ్చిన కొద్ది రోజులకు మాజీ సీఎంకి మళ్లీ తిరగబెట్టింది. దీంతో బెంగళూరు ఆస్పత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు. చివరకు పరిస్థితి విషమించి మంగళవారం ఆయన తెల్లవారుజామున 4.25 గంటలకు తుది శ్వాస విడిచారు.


బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ (79) అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం జరగనున్నాయి. అయితే, అధికార లాంఛనాలతో కాకుండా ఓ సామాన్య పౌరుడిలా ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. తాను ఎప్పుడు చనిపోయినా.. అంత్యక్రియలను నిరాడంబరంగా సామాన్య పౌరుడిలా నిర్వహించాలని ఆయన కోరుకున్నారని, ఆయన చివరి కోరికను నేరవేర్చుతామని కుటుంబసభ్యులు తెలిపారు. కొట్టాయం జిల్లాలోని పుథుపల్లి చర్చి ఆవరణలో నిర్మించిన ప్రత్యేక సమాధిలో మృతదేహాన్ని గురువారం మధ్యాహ్నం ఖననం చేస్తామని కుటుంబసభ్యులు పేర్కొన్నారు.


ఈ మేరకు కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఊమెన్ చాందీ కుటుంబం లేఖ రాయగా.. కేరళ ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది. ఊమన్ చాందీ కుమారుడు చాందీ ఒమెన్ మాట్లాడుతూ.. ‘గతేడాది నవంబరులో కేన్సర్ చికిత్స కోసం జర్మనీకి వెళ్లే ముందు తన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించరాదని అమ్మకు సూచించారు.. అదే ఆయన చివరి కోరిక.. ఆయన కోరికను కుటుంబ సభ్యులుగా మనం తీర్చాలి.. ఈ చివరి కోరిక గురించి మా అమ్మ ప్రభుత్వానికి తెలియజేసింది.. ప్రభుత్వ అధికార లాంఛనాలు లేకుండా అంత్యక్రియలు నిర్వహిస్తాం’ అని తెలిపారు.


తుపాకులతో గౌర వందనం వంటివి ఏవీ లేకుండా క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు జరుగుతాయని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత రమేశ్‌ చెన్నితాల వెల్లడించారు. ఊమెన్‌ చాందీ మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో తిరువనంతపురం నుంచి కొట్టాయంకు తరలించారు. కేరళ అసెంబ్లీ ‘నియమసభ’ సిబ్బంది భారమైన హృదయాలతో మాజీ ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికారు.


కేరళ రాష్ట్రానికి ఊమెన్ చాందీ రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతేకాదు, ఆయన ఏకంగా 12 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, నిరంతరాయం 53 ఏళ్లు సభకు ప్రాతినిధ్యం వహించారు. కొట్టాయం వద్ద దారికి ఇరువైపులా బారులు తీరిన జనం కన్నీటితో నివాళులు అర్పించిన తీరు ప్రజల హృదయాల్లో దివంగత నేతకు ఉన్న స్థానానికి నిదర్శనమని చెన్నితాల అన్నారు.


మరోవైపు, రాష్ట్రానికి చాందీ చేసిన సేవలను గుర్తుచేస్తూ కేరళ క్యాబినెట్ బుధవారం సంతాప తీర్మానాన్ని ఆమోదించింది. ప్రభుత్వంలో, కాంగ్రెస్‌లో తన విభిన్న పాత్రల ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంలో చాందీ ప్రధాన పాత్ర పోషించారని కొనియాడింది. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన ఊమెన్ చాందీ.. 27 ఏళ్ల వయసులో పూతుపల్లి నుంచి 1970లో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. వరుసగా 12 సార్లు అదే నియోజకవర్గం నుంచి గెలుపొందడం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa