ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది.. ఒడిశా సరిహద్దు తీర ప్రాంతాల్లో విస్తరించింది. ఇటు అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం విస్తరించింది. రుతుపవన ద్రోణి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో రానున్న మూడు రోజులు మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఐఎండీ సూచనల ప్రకారం వాయువ్య బంగాళాఖాతంపై అల్పపీడనం కేంద్రీకృతమైందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ఇది రానున్న 48 గంటల్లో ఒడిశా మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందన్నారు. ఈ ప్రభావంతో మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. నేడు మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలినచోట్ల జల్లులు పడే అవకాశం ఉన్నట్లు వివరించారు. రాష్ట్రంలో 3 రోజులు ముసురు వాతావరణం ఉంటుందని తెలిపారు.
మరోవైపు ఎగువ రాష్ట్రాల్లో భారీవర్షాలు వల్ల స్వల్పంగా గోదావరి వరద ఉధృతి పెరుగుతుందని తెలిపారు. ముందస్తుగా ప్రభావిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తం అయ్యింది.. విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తుంది. ముందస్తు సహయక చర్యలకు అల్లూరికు ఎన్డీఆర్ఎఫ్, ఏలూరుకు రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారు. విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
అత్యవసర సహయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 18004250101 లను అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లాల్లో మండలస్థాయిలో కూడా అధికారులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణం చేయొద్దని సూచించారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదన్నారు. గురువారం రాత్రి 7 గంటల నాటికి ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్ ఫ్లో 6,48,291 ఉందని.. శుక్రవారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు.
మరో రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయన్న అంచనాతో గోదావరి, కృష్ణా నదులకు వచ్చే వరదకు వర్షాలు కూడా తోడు అయితే పరిస్ధితులు ఇబ్బందికరంగా మారతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి వర్షాలు మాత్రమే కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa