ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసుకు సంబంధించి పలు కీలక సాక్షుల వాంగ్మూలాలను గత నెల 30వ తేదీన సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించిన విషయం తెలిసిందే. ఆ విషయాలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. తాజాగా, వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పొందుపర్చిన కీలక అంశాలు బయటికొచ్చాయి.
‘‘ఇంటికొచ్చి కలుస్తానంటూ 2019 మార్చి 22న సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి నాకు ఫోన్ చేశారు. నేను కడప, సైబరాబాద్ కమిషనరేట్ వెళ్లాల్సి ఉందని భారతికి చెప్పా. ‘ఎక్కువ సమయం తీసుకోను’ అంటూ భారతి మా ఇంటికి వచ్చేశారు. భారతితో పాటు విజయమ్మ, వైఎస్ అనిల్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి రావడంతో నేను ఆశ్చర్యపోయాను. లిఫ్ట్ వద్దే నిలబడి భారతితో మాట్లాడా. ఆ సమయంలో భారతి ఆందోళనగా కనిపించారు. నాన్న వివేకానందరెడ్డి మరణించాక తొలిసారి ఇంటికొచ్చినందుకు బాధగా ఉన్నారని అనుకున్నా.
అయితే, ఇకపై ఏం చేసినా సజ్జల రామకృష్ణారెడ్డితో టచ్లో ఉండాలని భారతి చెప్పారు. దీంతో మీడియాతో మాట్లాడాలని సజ్జల నాకు సూచించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆలోచన కొంత ఇబ్బందిగా అనిపించి నేరుగా మీడియాతో మాట్లాడకుండా ఒక వీడియో రికార్డు చేశాను. నాన్న గది శుభ్రం చేసేటప్పుడు అక్కడే ఉన్న సీఐ శంకరయ్యపై ఫిర్యాదు చేస్తున్నట్లు వీడియో చేసి సజ్జలకు పంపించాను.
దీంతో వీడియో కాదు.. ఈ అంశానికి ముగింపు పలికేలా ప్రెస్మీట్ పెట్టాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. జగనన్నతో పాటు వైఎస్ అవినాష్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించాలని సజ్జల సలహా ఇచ్చారు. నేను అప్పటి వరకు అవినాష్ రెడ్డి పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ, అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావించాలని సజ్జల చెప్పినప్పుడు కొంత సంకోచించాను. అవినాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని మా నాన్న కోరుకోలేదని తెలుసు. కానీ, మా రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా విభేదాలు ఉన్నాయి.
ఈ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి సలహా మేరకు హైదరాబాద్ ప్రెస్క్లబ్లో ప్రెస్మీట్ పెట్టాను. గదిని శుభ్రం చేయడంపై దర్యాప్తు చేయాలని మొదటి నుంచీ అడుగుతున్నా. పొరపాటు జరిగిందని తెలుసు.. కానీ, క్రిమినల్ మైండ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోలేదు. జగనన్నను ముఖ్యమంత్రిగా చూడాలని నాన్న (వివేకానందరెడ్డి) చాలా కష్టపడ్డారు. ఎవరో చేసిన పొరపాట్ల వల్ల మళ్లీ జగన్ నష్టపోవాలా అని ఆలోచించాను.
ఇక, మార్చురీ బయట ఉన్నప్పుడు ఓ ఫిర్యాదు రాసుకొచ్చి సంతకం చేయమన్నారు. ఆ ఫిర్యాదులో తెలుగు దేశం పార్టీ నాయకుడు బీటెక్ రవితో ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులపై ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు వివేకా ఎన్నికల ప్రచారానికి టీడీపీ నేతలు భయపడ్డారని అవినాష్ రెడ్డి నాకు చెప్పారు. టీడీపీ నేతలు మనసులో ఏదో పెట్టుకొని ఈ నేరానికి పాల్పడ్డారని అవినాష్ అన్నారు. అయితే, ఆ ఫిర్యాదుపై నేను సంతకం చేయలేదు.
2019 జూలైలో అవినాష్ రెడ్డిపై నాకు అసహనం మొదలైంది. వివేకా హత్య గురించి మా కుమారుడికి ముందే తెలుసునని గజ్జల ఉదయ్కుమార్రెడ్డి తల్లి ఒకరితో చెప్పారు. మృతి విషయం బయటకు రాకముందే కుమారుడికి తెలుసని ఆమె అన్నారు. అవినాష్రెడ్డి, శివశంకర్రెడ్డికి ఉదయ్ ప్రధాన అనుచరుడు కాబట్టి అనుమానం వచ్చింది. ఈ క్రమంలో వైఎస్ భారతి, సజ్జల రామకృష్ణారెడ్డి వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్లను సీబీఐకి ఇచ్చాను’’ అని వాంగ్మూలంలో సునీత పేర్కొన్నట్లు సీబీఐ.. తన నివేదికలో పొందుపరిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa