మణిపూర్ అంశంపై పార్లమెంటులో ప్రధాని మోదీని ప్రశ్నించాలని.. సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలు.. చివరగా అవిశ్వాస తీర్మాన అస్త్రాన్ని ప్రయోగించాయి. ఈ నేపథ్యంలోనే లోక్సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు స్పీకర్కు నోటీసులు అందించగా.. దానికి స్పీకర్ అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అవిశ్వాస తీర్మానం గురించి 2019 లోక్సభ ఎన్నికల ముందు పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బయటికి వచ్చాయి. తమ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు.. అవిశ్వాస తీర్మానం పెట్టాలని సూచించారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా దూరదర్శన్ న్యూస్ ట్విటర్లో పంచుకుంది.
ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగేళ్ల ముందే ఊహించారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు 2019 కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అవిశ్వాస తీర్మానం గురించి ప్రస్తావించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై నిర్వహించిన చర్చలో మోదీ ప్రసంగించారు. 2023 లో తమ ప్రభుత్వంపై అవిశ్వాసం తీసుకొచ్చేలా ప్రతిపక్షాలకు అవకాశం రావాలని.. అందుకు అన్ని పార్టీలు సిద్ధం కావాలని తాను కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానంపై ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలతో సభలో ఉన్న అధికార పక్షానికి చెందిన ఎంపీలు నవ్వారు. అంటే 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు దేశంలో ఓటమి తప్పదని.. ప్రతిపక్షానికే పరిమితం అవుతుందని ఎద్దేవా చేస్తూ ఆ సమయంలో ప్రధాని మోదీ ఇలా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నాలుగేళ్ల తర్వాత సరిగ్గా అదే జరిగి.. ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.
తన ప్రసంగంలో భాగంగా ‘‘గతంలో లోక్సభలో 400 కు పైగా ఎంపీలు సాధించిన కాంగ్రెస్ పార్టీ 2014 లో 40 స్థానాలకే పరిమితమైంది. అది వారి అహంకారం వల్ల జరిగిన పరిణామం. అదే సమయంలో సేవాభావం వల్లే రెండు స్థానాల నుంచి ఒంటరిగా అధికారంలోకి వచ్చే స్థాయికి బీజేపీ ఎదిగింది’’ అని కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రధాని మోదీ హేళన చేశారు. తాజాగా మణిపుర్ అంశంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ నేపథ్యంలోనే గతంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గతంలో 2018 లో అప్పటి ప్రతిపక్షాలు మోదీ సర్కార్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అయితే దానిపై నిర్వహించిన ఓటింగ్లో అధికార పార్టీకి 325 మంది ఎంపీల మద్దతు రాగా.. ప్రతిపక్షాలకు 126 మంది ఎంపీలు మాత్రమే సపోర్ట్ చేశారు. దీంతో ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa