కర్నూలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఓ మహిళతో మాట్లాడిన ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ మారిన నేపథ్యంలో దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనపై ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఓ మహిళతో మాట్లాడింది వాస్తవమేనని.. అందులో అసభ్యకరంగా ఏముందని ప్రశ్నించారు. రెండేళ్ల క్రితం నాటి ఆడియో క్లిప్ను ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు తెరపైకి తెచ్చాయని ఆరోపించారు.
ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే ఇదంతా చేస్తున్నారన్నారని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆరోపించారు. ఎమ్మెల్యే వద్దకు ఎన్నో సమస్యలతో ఎంతో మంది వస్తుంటారని.. వారితో మాట్లాడటం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోపై సమగ్ర విచారణ జరపాలని పోలీసులను కోరనున్నట్లు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తెలిపారు.
‘‘నా మీద నీకు నమ్మకం లేదా? అంతా మేము చూసుకుంటాం.. బిజినెస్లో షేర్ ఇస్తాం కదా! ఎంత పెట్టుకోగలవు’’ అంటూ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఓ మహిళతో ఫోన్ కాల్ మాట్లాడారు. ‘‘3 వరకు పెట్టుకుంటాను. మీ ఇంటికి వచ్చి నేరుగా మీతోనే మాట్లాడుతాను’’ అంటూ మహిళ సమాధానం ఇచ్చారు. ఆ ఆడియో క్లిప్లో వీటితో పాటే మరి కొన్ని సంభాషణలు ఉన్నాయి. ఎమ్మెల్యేతో మాట్లాడిన మహిళ ఎవరు? ఆ డీల్ ఏంటి? అనేదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
దీనిపై తెలుగు దేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ‘‘ప్రజాసేవ అంటే ప్రజలను పిండుకోవడం, ప్రజల నుంచి దండుకోవడం అనుకున్నట్టున్నారు వైసీపీ నేతలు. అందులోనూ ఈసారి ఓడిపోవడం ఖాయం అని తెలిసాక రేపు అన్నది లేదు అన్నట్టుగా తెగబడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఎలా అడ్డంగా దొరికిపోయారో చూడండి.’’ అంటూ వీడియో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో ఆడియో సంభాషణలపై ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వివరణ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa