ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ను ఉద్దేశించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమ కూటమి దేశానికి అనుకూలంగా ఉందని దీదీ వ్యాఖ్యానించారు. హింసకు బీజేపీ మద్దతు ఇస్తోందని ఆరోపించిన ఆమె.. వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల్లో తమ కూటమి తప్పక విజయం సాధిస్తుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం లోక్సభలో ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు 2023పై చర్చ సందర్భంగా.. ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వొద్దని ఇండియా కూటమిలోని పార్టీలపై కేంద్ర హోం మంత్రి విమర్శలు గుప్పించారు.
కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై నాలుగు గంటల చర్చ అనంతరం ప్రతిపక్షాల తీవ్ర నిరసనలు, వాకౌట్ మధ్యే సభ ఆమోదించింది. అధికారుల నియంత్రణపై ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అధిగమించే ఈ బిల్లును షా సమర్థించారు. ప్రతిపక్ష పార్టీలు తమ కూటమిపై మాత్రమే కాకుండా ఢిల్లీ విషయంలో ఆలోచించాలని ఆయన చురకలంటించారు.
‘మీరు కూటమిలో ఉన్నందున ఢిల్లీలో జరుగుతున్న అవినీతికి మద్దతు ఇవ్వవద్దని నేను పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను.. ఎందుకంటే పొత్తులు ఉన్నప్పటికీ ప్రధాని మోదీ వచ్చే ఎన్నికలలో పూర్తి మెజారిటీతో గెలుస్తారు’ అని హోం మంత్రి జోస్యం చెప్పారు. షా వ్యాఖ్యలపై ధీటుగా స్పందించిన తృణమూల్ అధినేత్రి.. ఢిల్లీ విజయం ‘ఇండియా’కూటమికి కూడా విజయమని అర్థం కాబట్టి షా అన్నది నిజమే అన్నారు.
‘మా కూటమి కొత్తది.. దేశవ్యాప్తంగా మా ఉనికి ఉంది.. అయితే, ఇండియా కూటమి రాజధాని ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.. ఢిల్లీలో మా పార్లమెంటు ఉంది. అతను ఉద్దేశపూర్వకంగా లేదా యాదృశ్చికంగా అన్నారో నాకు తెలియదు కానీ సరిగ్గానే చెప్పారు.. మా కూటమికి దేశవ్యాప్తంగా ఉనికి ఉందని, విపత్తు, మతపరమైన ఉద్రిక్తతలు, నిరుద్యోగం నుంచి దేశాన్ని రక్షించడానికి తప్పక గెలవాలని మమతా బెనర్జీ పేర్కొన్నారు.
‘భారతదేశం మా మాతృభూమి.. ఈ ఇండియా కూటమి మన మాతృభూమి కోసం.. అందుకే ఎన్డీఏకు విలువ లేదు.. అనేక ఏళ్లుగా కూటమి పార్టీలతో సమావేశం నిర్వహించలేదు. ఇంతకుముందున్నవారు బయటకు వెళ్లిపోయారు’ అని దీదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఉగ్రవాదాన్ని సృష్టించడం వారి సంప్రదాయం.. రాజ్యాంగం కాదు. కొన్నిసార్లు నేను సిగ్గుపడుతున్నాను. దళితులు, గిరిజనులు, మైనారిటీలు చిత్రహింసలకు గురవుతున్నారు. విలేకరులను కూడా వారు హిందువులా లేదా ముస్లింలా అని అడుగుతున్నారు. హింస తప్ప మరో మార్గం లేదని వారు అనుకుంటున్నారు’అని దీదీ దుయ్యబట్టారు. ‘వారు (బీజేపీ) హింసను ఎంచుకుని, ప్రతిదానిని కాషాయం చేస్తారు.. కాషాయం అంటే మాకు ఇష్టం లేదని కాదు. కానీ దేశం మొత్తం అదే రంగులో ఉంటే, ఇతర రంగులు ఎక్కడికి పోతాయి? కాషాయం మన దేవుళ్లకు, త్యాగానికి సంబంధించిన దివ్యమైన రంగు. హింసను సూచించడానికి వారు దానిని ఉపయోగిస్తే ప్రజలు అంగీకరించరు’ అని దీదీ వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa