ఏపీలో దుమారం రేపుతోన్న పుంగనూరు ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దాడులకు పాల్పడినవారు, కారణమైన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. ఈ ఘటనపై ఇప్పటివరకు మూడు కేసులు నమోదు చేయగా.. 50 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినవారిలో టీడీపీ కార్యకర్తలు, నేతలు ఉన్నారు.
అరెస్ట్ చేసిన నిందితులను వివిధ పోలీస్ స్టేషన్లలో ఉంచి విచారిస్తున్నట్లు రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. పోలీసులపైనే బీర్ బాటిళ్లు, రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడటం హేయమైన చర్య అని, ఈ హింసాత్మక ఘటనల్లో పలువురు పోలీసులు గాయపడినట్లు చెప్పారు. ప్రస్తుతం గాయపడిన పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్పష్టం చేశారు. దాదాపు 11 మంది పోలీసులకు తీవ్ర గాయాలు, 30 మంది స్వల్ప గాయాలైనట్లు చెప్పారు. గాయపడిన వారిలో డీఎస్పీ కూడా ఉన్నారన్నారు. టీడీపీ కార్యకర్తల దాడిలో ఐదు పోలీస్ వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయన్నారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా హింసకు పాల్పడిన వారందరినీ గుర్తించామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని, వేరే రూట్లో వెళ్లకుండా అప్పటికప్పుడు రూట్ మార్చుకున్నట్లు తెలిపారు. అప్పటికప్పుడు టీడీపీ శ్రేణులు జనసమీకరణ చేశారని, దీనిని బట్టి చూస్తే ముందస్తు ప్లాన్ ఉందని అర్థమవుతుందన్నారు. రెండు పోలీస్ వాహనాలకు టీడీపీ శ్రేణులు నిప్పు పెట్టారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే 60 ఏళ్లు పైబడిన ఇద్దరు వృద్ధులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో అక్రమంగా కేసులు నమోదు చేశారని, అల్లర్లకు ఏమాత్రం సంభందంలేని అమాయకులపై కేసులు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa