నీళ్లు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచిదని ప్రతి ఒక్కళ్లూ చెబుతుంటారు. వేసవిలో పండ్ల రసాలు, ద్రవాలను ఎక్కువగా తీసుకోవడం చాలా అవసరం. దీని వల్ల శరీరం నిర్జలీకరణం (డీహైడ్రేషన్) కాకుండా ఉంటుంది. అతి ఏదైనా అనర్ధదాయకమే. కానీ, నీటి విషయంలోనూ అంతే. మోతాదుకు మించి నీటిని తీసుకుంటే అది విషతుల్యంగా మారుతుందని తెలుసా?. ఇందుకు ఓ మహిళ ఉదంతమే రుజువు. అమెరికాకు చెందిన ఓ 35 ఏళ్ల మహిళ.. ఎండ వేడిమికి భరించలేక అతిగా నీరు తాగి ప్రాణాలు కోల్పోయింది. ఆమె 20 నిమిషాల్లో 2 లీటర్ల నీరు తాగడంతో అది విషంగా మారి ప్రాణాలను హరించింది.
ప్రస్తుతం అమెరికాలో వేసవి ఠారెత్తిస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో జనం అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో ఇండియానాకు చెందిన యాష్లే సమ్మెర్స్ అనే మహిళ అతిగా నీరు తాగడం వల్ల వాటర్ టాక్సిటీ (water toxicity) అనే స్థితికి గురైనట్టు వైద్యులు వెల్లడించారు. తక్కువ సమయంలో ఎక్కువ నీరు తాగితే.. ఆ నీరే విషంగా మారి ప్రాణం తీస్తుందని, ఇది అరుదుగా జరిగే ఘటన అని వారు వివరించారు.
యాష్లే సమ్మెర్స్ జులై చివరి వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి ఔటింగ్కి వెళ్లింది. వేడి ఎక్కువగా ఉండటం వల్ల ఆమె తట్టుకోలేక డీహైడ్రేట్ అయ్యింది. దాంతో కేవలం 20 నిమిషాల్లో 2 లీటర్ల నీటిని తాగింది. ఆ తర్వాత తనకు తలనొప్పిగా ఉందని, తల తిరుగుతోందని చెప్పడంతో వెంటనే ట్రిప్ కాన్సిల్ చేసుకొని ఇంటికి తిరిగొచ్చేశారు. కానీ ఆమె ఇంట్లోకైనా అడుగుపెట్టకుండానే.. కారు గ్యారేజీలోనే కుప్పకూలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఐయూ హెల్త్ అర్నెట్ట్ హాస్పిటల్లో చేర్పించారు. కానీ ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు నిర్దారించారు.
యాష్లే అన్న డెవాన్ మిల్లర్ ఈ విషాదకర ఘటన గురించి చెబుతూ ‘20 నిమిషాల్లో ఆమె నాలుగు బాటిళ్ల నీరు తాగిందని ఎవరో చెప్పారు. నా ఉద్దేశం సగటు వాటర్ బాటిల్ 16 ఔన్సులు.. అంటే 64 ఔన్సులు (సుమారు 2 లీటర్లు) ఆమె 20 నిమిషాల వ్యవధిలో తాగింది.. యాష్లే ఇంటికి వచ్చినప్పుడు గ్యారేజీలో స్పృహకోల్పోయింది.. మరో సోదరి హోలీ నన్ను వెంటనే పిలిచింది.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాం.. ఆమె మెదడు వాపునకు గురైందని కారణమేమిటో తెలియదని వైద్యులు తెలిపారు’ అని వాపోయాడరు.
నీరు తాగితే చనిపోవడం ఏంటి అని అనుకోవచ్చు. దీనిపై డాక్టర్లు వివరణ ఇచ్చారు. అతిగా నీరు తాగితే శరీరంలోని హార్మోన్ల బ్యాలెన్స్ తప్పుతుందనీ, కిడ్నీలకు అతిగా నీరు చేరుతుందని అంటున్నారు. దీని వల్ల శరీరంలోని రక్తం నుంచి సోడియం, పొటాషియం పెద్ద మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఫలితంగా కండరాల నొప్పి, వికారం, తలనొప్పి, గొంతు నొప్పి, నీరసం వంటివి తలెత్తుతాయి. ప్రస్తుతం కేసులో ఆ మహిళ అతిగా నీటిని తీసుకోవడం వల్ల మెదడు వాపునకు గురైందని వివరించారు.
బయట ప్రదేశాల్లో ఎక్కువ సమయం పనిచేసేవారు, అతిగా జిమ్, వర్కవుట్లు చేసేవారు నీరు తాగుతారనీ.. వారికి తరచూ ఇలాంటి సమస్య వస్తుందని డాక్టర్ బ్లేక్ ఫ్రోబెర్గ్ తెలిపారు. శరీరంలో తగినంత ఉప్పు (sodium) లేకుండా అతిగా నీరు తాగితే.. ప్రాణాంతకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రోలైట్స్, పొటాషియం, సోడియం కలిసిన ద్రవాలు తాగాలని సూచిస్తున్నారు. ఇక, యాష్లే గుండె, లివర్, ఊపిరితిత్తులు, కిడ్నీలు, ఎముకల టిష్యూలను.. ఐదుగురికి దానం చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa