నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా సత్తా, శక్తి సామర్థ్యాలు ఉన్న శరద్ పవార్ ప్రధాని పదవి చేపట్టాల్సి ఉందని.. అయితే ఒకే ఒక్క కారణంతో ఆయనకు ప్రధాని పదవి దక్కలేదని వ్యాఖ్యానించారు. ఎన్సీపీలో చీలిక తెచ్చిన శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్.. ఇటీవలె మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన షిండే వర్గం, బీజేపీ కూటమిలో చేరి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఆ తర్వాత అజిత్ పవార్ పలుమార్లు శరద్ పవార్తో సమావేశం కావడం.. ఇటు శరద్ పవార్ విపక్షాలకు చెందిన ఇండియా కూటమిలో సభ్యుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా శరద్ పవార్పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అటు.. మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
కాంగ్రెస్ పార్టీ స్వార్థపూరిత రాజకీయాలు, కుటుంబ రాజకీయాల వల్లే.. సత్తా ఉన్నప్పటికీ.. శరద్ పవార్ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించలేకపోయారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది గొప్ప నేతలు.. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు బలైపోయారని ఆరోపించారు. ప్రణబ్ ముఖర్జీ, శరద్ పవార్ వంటి నేతలు ప్రధానమంత్రి పదవిని చేపట్టే అర్హత, సామర్థ్యం ఉన్నప్పటికీ వారు ఆ పదవి తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుపడిందని విమర్శలు గుప్పించారు. రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన ఎన్డీఏ కూటమి ఎంపీలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఎన్డీఏ కూటమిని సిద్ధం చేయడం కోసం.. రాష్ట్రాల వారీగా విభజించి కొన్నిరోజులుగా ప్రధాని మోదీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఎన్సీపీని స్థాపించకముందు 1991 జూన్ నుంచి 1993 మార్చి వరకు ప్రధానమంత్రి పీవీ నరసింహారావు మంత్రివర్గంలో శరద్ పవార్ రక్షణ శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 1999లో కాంగ్రెస్ నుంచి వైదొలిగిన శరద్ పవార్.. ఎన్సీపీని స్థాపించారు. అనంతరం 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమిలో చేరి.. 2014 వరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. అయితే ఇటీవల ఎన్సీపీలో శరద్ పవార్ అన్న కొడుకు, సీనియర్ నేత అజిత్ పవార్ తిరుగుబావుటా ఎగురవేశారు. తన వర్గం ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి.. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ, శివసేన షిండే వర్గానికి మద్దతు పలికారు. అనంతరం మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa