ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోక్‌సభలో ఎంపీకి నారాయణ్ రాణే హెచ్చరికలు,,,ప్రతిపక్షాలపై కేంద్రమంత్రుల బెదిరింపులు

national |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2023, 09:17 PM

కేంద్రంపై ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా కేంద్రమంత్రి నారాయణ్ రాణే లోక్‌సభలో వ్యవహరించిన తీరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ ఎంపీని ఉద్దేశిస్తూ నారాయణ్ రాణే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల లోక్‌సభలో మాట్లాడిన మరో కేంద్రమంత్రి మీనాక్షి లేఖి.. ప్రతిపక్షాలను బెదిరించడం తీవ్ర చర్చకు దారితీసింది. కొన్ని రోజుల వ్యవధిలోనే తాజాగా నారాయణ్ రాణే.. హెచ్చరికలు చేయడం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే పార్లమెంటులోనే కేంద్రమంత్రులు.. విపక్ష ఎంపీలను బెదిరించడం ఏంటని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. విపక్ష ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేసే స్పీకర్.. అధికార పార్టీకి చెందిన కేంద్రమంత్రిని సస్పెండ్ చేస్తారా అని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి.


అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా లోక్‌సభలో కేంద్రమంత్రి నారాయణ్ రాణే మంగళవారం సంయమనం కోల్పోయారు. ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన ఎంపీ అర్వింద్ సావంత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ, అమిత్ షాలపై విమర్శలు చేసే స్థాయి అర్వింద్ సావంత్‌కు లేదంటూ లోక్‌సభలో కేంద్రమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "సావంత్‌.. మీరు కూర్చోండి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాపై వ్యాఖ్యలు చేసే స్థాయి మీకు లేదు. ఒకవేళ మీరు మాట్లాడితే.. దాని పరిణామాలు తప్పకుండా మీరు ఎదుర్కొంటారు" అని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా కలగజేసుకున్న లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా.. నారాయణ్ రాణే చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కేంద్రమంత్రిని మందలించిన లోక్‌సభ స్పీకర్.. సరైన పదజాలం ఉపయోగించండి అంటూ సూచనలు చేశారు.


సహచర ఎంపీపై కేంద్రమంత్రి నారాయణ్ రాణే బెదిరింపులకు దిగడంపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తం అయ్యాయి. నారాయణ్ రాణే లోక్‌సభలో ఒక కేంద్రమంత్రిలా కాకుండా రౌడీలా బెదిరింపులకు దిగారని.. ఆమ్‌ ఆద్మీ పార్టీ మండిపడింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌ను ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలను వెంటనే సభ నుంచి సస్పెండ్ చేస్తారు. ఇలాంటి అనుచిత భాష ఉపయోగించిన బీజేపీ కేంద్రమంత్రిని సస్పెండ్ చేస్తారా అని ఆప్ నేతలు ప్రశ్నించారు. కేంద్రమంత్రి నారాయణ్ రాణే తాను చేసిన వ్యాఖ్యలతో మోదీ ప్రభుత్వ స్థాయిని, ప్రమాణాలను చూపిస్తున్నారంటూ ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది మండిపడ్డారు.


ఇక ఇటీవల లోక్‌సభలో మరో కేంద్రమంత్రి మీనాక్షి లేఖి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి తెరతీశాయి. ఆమె మాట్లాడుతుండగా.. ప్రతిపక్ష నేతలు నినాదాలు చేస్తుండటంతో సహనం కోల్పోయిన ఆమె.. విపక్ష సభ్యులు సైలెంట్‌గా ఉండాలని.. లేకపోతే వారి ఇంటికి ఈడీ అధికారులు వస్తారని మీనాక్షి లేఖి బెదిరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీలను కేంద్రంలోని మోదీ సర్కార్.. రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటుందని తాము తరచూ చేస్తున్న ఆరోపణలు మీనాక్షి లేఖి వ్యాఖ్యలతో నిజం అయ్యాయని.. ప్రతిపక్షాలు మండిపడ్డాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa