ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈగల బెడద తట్టుకోలేక ,,,వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి గ్రామస్థుల ఆందోళన

national |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2023, 09:20 PM

ప్రజలు తమకు జరుగుతున్న అసౌకర్యాలు, సమస్యల పరిష్కారం కోసం వివిధ రకాల్లో నిరసన వ్యక్తం చేస్తూ ఉంటారు. రోడ్లను దిగ్బందించి, అధికారులను ఆఫీసుల్లో ఉంచి తాళాలు వేయడం, ట్యాక్స్‌లు కట్టకుండా ఉండటం ఇలా రకరకాలుగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఆ గ్రామంలో మాత్రం అధికారులకు తమ గోడు ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని వినూత్నంగా ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఉన్న వాటర్‌ ట్యాంక్ ఎక్కి నిరసన చేశారు. ఇంతకీ వారి సమస్య ఏంటి అనుకుంటున్నారా. ఈగల బెడద. ఏంటి ఈగల బెడద కోసం ఏకంగా వాటర్ ట్యాంక్ ఎక్కారా అని ఆశ్చర్యపోతున్నారా. అదే మరి వారికి అతిపెద్ద సమస్య. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.


వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌ జిల్లాలో ఉన్న కుయ్య గ్రామంలో కొన్ని రోజుల నుంచి ఈగలు.. గ్రామస్థులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇళ్లలో ఎటు చూసినా ఈగలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇంట్లో వండుకున్న ఆహార పదార్థాల నుంచి దుస్తులు, పడుకునే బట్టలు, ఇలా ప్రతీ చోట ఈగలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రి అయితే పడుకోవడం గగనంగా మారిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఈగల బెడద కారణంగా గత కొన్ని రోజులుగా ఆ గ్రామంలో పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలు కూడా జరగడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఈగల బాధ తట్టుకోలేక కొంత మంది ఆ ఊరును వదిలి వేరే ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఇక ఆ గ్రామస్థుల బంధువులు కూడా కుయ్య గ్రామానికి రావడం పూర్తిగా మానేశారట.


అయితే ఈ ఈగల సమస్య గురించి ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడని ఆ గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుక్షణం దోమ తెరల కిందే కాలం వెళ్లదీస్తున్నట్లు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఆ కుయ్య గ్రామంలో అంత దారుణంగా ఈగలు వీరంగం సృష్టించడానికి గ్రామంలో ఉన్న పౌల్ట్రీ ఫామ్ కారణమని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని గతంలో అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లభించలేదని గ్రామస్థులు ఆరోపణలు చేశారు.


ఈ క్రమంలోనే ఈగల బాధతో విసిగిపోయిన కుయ్య గ్రామస్థులు తమ నిరసనను అందరికీ తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులు ఊర్లో ఉన్న వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఆందోళనకు దిగారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గంటల తరబడి వారితో చర్చించి.. గ్రామస్థులను కిందికి దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. త్వరలోనే పౌల్ట్రీఫామ్‌ను పరిశీలించి ఈగల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని అధికారులు, పోలీసులు హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa