ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతి రైతులతో లోకేష్ సమావేశం,,,ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి యాంకరింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 14, 2023, 10:03 PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో జరుగుతోంది. యువగళం 183వ రోజు పాదయాత్ర సందర్భంగా ‘అమరావతి ఆవేదన’ పేరుతో రావెలలో అమరావతి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తన వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారని.. ఎవరూ ఏమీ పీకలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


రాజధాని కోసం మాట్లాడితే తాడికొండలో ఎలా తిరుగుతావో చూస్తామని సవాల్‌ చేశారని.. ఇదిగో ఇప్పుడిలా ధైర్యంగా అందరి అండదండలతో తిరగగలుగుతున్నాను అన్నారు. తాను ఇంత ధైర్యంగా మాట్లాడటానికి చంద్రబాబు, లోకేష్ ఇచ్చిన ధైర్యమే కారణమన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మాట విని అమరావతి రైతులను తాను కూడా మోసం చేశానని ఈ కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశారు. తనను క్షమించాలని వేడుకున్నారు.. ఏదైనా మాట్లాడితే మంత్రులు పది మంది తనను ట్రోల్‌ చేసి వేధిస్తారని వెనకడుగు వేసే సమస్య లేదన్నారు. చంద్రబాబు, లోకేష్ ఇచ్చిన ధైర్యంతోనే తాను ముందుకు వచ్చానన్నారు.


ఇకపై అమరావతి ఉద్యమంలో రైతులతో కొనసాగుతానన్నారు శ్రీదేవి. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని తుక్కుతుక్కుగా ఓడించి టీడీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. అందరం ధైర్యంగా పోరాడితే అప్పుడే విజయం సొంతమవుతుందన్నారు. ప్రజా రాజధాని అమరావతి కల నెరవేరాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలన్నారు. అప్పుడు దేవతల రాజధానిని తలదన్నేలా అమరావతిని నిర్మించి రాష్ట్రానికిస్తారన్నారు. తన వల్ల అమరావతి రైతులకు జరిగిన తప్పును క్షమించాలని కోరారు. రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి తాను కూడా మోసం చేశానని.. ప్రతి క్షణం రైతులు పడుతున్న బాధ తానూ పడ్డాను అన్నారు.


అమకావతి రైతులపై పోలీసుల్ని ప్రయోగించి జులుం ప్రదర్శిస్తున్నారన్నారు శ్రీదేవి. రైతులను ఏమైనా చేయాలనుకుంటే శ్రీదేవి వారికి ముందుంటుంది అన్నారు. వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచినందున ఉద్యమంలోకి ముందుగా రాలేకపోయానని.. ఇప్పుడు తన వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారన్నారు. తన ప్రాణం పోయినా అమరావతి సాధించే వరకు సమిధనై రైతులతో కలసి పోరాడతాను అన్నారు. అమరావతి నుంచే వైఎస్సార్‌సీపీ పతనం మొదలైందన్నారు.


అమరావతి మహిళా రైతుల కన్నీరే జగన్‌ను భూస్థాపితం చేస్తుందన్నారు లోకేష్. మార్పు అనేది జగన్‌ ఇంట్లోనే మొదలైందని.. సొంత పార్టీ వాళ్లే జగన్‌‌ను నమ్మం అంటున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2019లో అమరావతి నిర్మాణ పనులు ఎక్కడ ఆగిపోయాయో అక్కడి నుంచి ప్రారంభించే బాధ్యత తీసుకుంటామన్నారు. అమరావతి రైతులు ధైర్యంగా ఉండాలని.. మాయ మాటలు చెప్పి జగన్‌ ఇన్నాళ్లూ తప్పించుకున్నారన్నారు. కులం, ప్రాంతం పేరుతో ఇప్పుడు విషం కక్కాలని చూస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో ఎకరా రూ.వందకోట్లకు పెంచింది కులమా.. కర్ణాటకకు ఫాక్స్‌కాన్‌ తీసుకెళ్లింది మతమా అని ప్రశ్నించారు.


ఎన్నికల ముందు కులం ముద్ర వేసి అమరావతిని నాశనం చేశారన్నారు. ఇప్పుడు రైతులు, పేదల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలనుకుంటున్న వ్యక్తి జగన్‌ అని విమర్శించారు. ఆర్-5 జోన్‌ భూమినిచ్చి దాన్ని కోర్టు కొట్టేస్తే పేదలకు రైతులు, తెలుగుదేశం వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటామన్నారు. ఎన్నికల ముందు జగన్‌ ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని అన్నారని.. ఎన్నికల తర్వాత జగన్‌ మాట తప్పి మడమ తిప్పారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa