ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కలకలం,,,పరుగులు తీసిన విద్యార్థులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 14, 2023, 09:58 PM

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కలకలం సృష్టించింది. ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్‌లో చిరుత పులి కనిపించింది. దీంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. చిరుత సంచారంపై వర్శిటి సెక్యూరిటీ అధికారులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. తిరుమల కొండపై చిరుతలు కలకలం సృష్టిస్తుండగా.. ఇప్పుడు తిరుపతిలో కూడా చిరుతల సంచారం భయాందోళనకు గురి చేస్తోంది. ఎస్వీ యూనివర్సిటీలో గతంలోనూ చిరుతలు కనిపించాయి. ఇప్పుడు మరోసారి కనిపించడంతో విద్యార్థుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది.


ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే బాలికపై చిరుత దాడి చేసి చంపేసిన ఘటన మరువకముందే ఆదివారం మెట్ల మార్గంలో ఒక చిరుత కనిపించింది. అలాగే సోమవారం ఉదయం కూడా నడకమార్గంలో ఒక చిరుత కనిపించినట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ అది చిరుత కాదని, జింక అని అటవీశాఖ అధికారులు గుర్తించారు. లక్షిత ఘటన తర్వాత చిరుతలను పట్టుకునేందుకు అటవీ సిబ్బంది బోన్లు, ట్రూప్ కెమెరాలను అటవీ ప్రాంతంో ఏర్పాటు చేశారు. దీంతో ఇవాళ ఉదయం ఒక ఆడ చిరుత బోన్‌లో చిక్కుకుంది. లక్షితపై దాడి చేసింది ఈ చిరుతేనా? కాదా? అనేది అధికారులు పరిశీలిస్తున్నారు. మరో ఐదు చిరుతల కదలికలు సీసీ కెమెరాల్లో కనిపించాయని, వాటిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇప్పటికే తెలిపారు.


ఇప్పటికే తిరుమల కొండపై చిరుతల సంచారం భక్తులను భయపెడుతుండగా.. ఇదే సమయంలో ఇప్పుడు ఎస్వీ యూనివర్సిటీలో చిరుతలు కనిపించడం మరింత ఆందోళన కల్గిస్తోంది. ఎస్వీ యూనివర్సిటీలో ఎంతోమంది విద్యార్థులు హాస్టళ్లల్లో ఉంటారు. చిరుతల సంచారం వల్ల వారందరూ ఆందోళన చెందుతున్నారు. రాత్రిపూట బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. సాయంత్రం తర్వాత చిరుతలు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.


కాగా తిరుమలలో చిరుతల సంచారం నేపథ్యంలో టీటీడీ చర్యలు చేపట్టింది. భక్తుల భద్రత దృష్ట్యా పలు ఆంక్షలు అమలు చేస్తోంది. నడకమార్గంలో మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 15 ఏళ్లలోపు పిల్లలను అనుమతిస్తోంది. తిరుమలలో చిన్నారులు తరచూ అదృశ్యం అవుతున్నారు. దీంతో పిల్లలను ట్యాగ్ విధానం అమలు చేస్తున్నారు. పిల్ల చేతికి తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ ఉండే ట్యాగ్ అతికిస్తున్నారు. అలాగే ఘాట్ రోడ్లలో నేటి నుంచి సాయంత్రం ఆరు తర్వాత ద్విచక్ర వాహనాలకు అనుమతి నిరాకరించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa