ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 18న టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 15, 2023, 06:48 PM

తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి స్థలాలను మంగళవారం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ పరిపాలనలో టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు మంజూరయ్యాయని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో తాను చైర్మన్‌గా ఉన్నప్పుడే టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల కోసం అభ్యర్థించామని, అయితే అనంతరం జరిగిన కీలక పరిణామాల వల్ల సాధ్యం కాలేదన్నారు. ప్రస్తుతం జగన్ హయాంలో అది సాధ్యమైనందుకు సంతోషంగా ఉందన్నారు.


జగన్‌తో పాటు టీటీడీ పాలకమండలి సభ్యులు రాష్ట్రంలోని ఉద్యోగులతో స్నేహపూర్వక వాతావరణంతో ఉంటామని కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. టీటీడీ ఉద్యోగస్తుల ఇంటి స్థలాల కోసం మరో 100 ఎకరాల సైతం సీఎంతో మాట్లాడి మంజూరు చేయిస్తానన్నారు. ఈ నెల 18వ తేదీన టీటీడీ ఉద్యోగులకు కొంతమందికైనా ఇంటి పట్టాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. టీటీడీలోని ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వడానికి కృషి చేస్తామని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా ఈ నెల 10వ తేదీన టీటీడీ ఛైర్మన్‌గా భూమన బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా నాలుగేళ్లపాటు వ్యవహరించారు. ఆయన పదవీకాలం ముగియడంతో భూమనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa