ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖలో చంద్రబాబు పాదయాత్ర,,,, ప్రభంజనంలా జనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 15, 2023, 09:10 PM

విశాఖపట్నంలో ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర చేపడుతున్నారు. దాదాపు రెండున్నర కిలోమీటర్లు చంద్రబాబు పాదయాత్ర కొనసాగనుంది. ఆర్కే బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు బాబు పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్ర ముగిసిన అనంతరం ఎంజీఎం గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో 2047 విజన్ డాక్యుమెంట్‌ను చంద్రబాబు విడుదల చేయనున్నారు.


ఆర్కే బీచ్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా పట్టుకుని చంద్రబాబు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ పాదయాత్రలో బాబు వెంట పార్టీ శ్రేణులు, సాధారణ ప్రజలు జెండా పట్టుకుని నడుస్తున్నారు. పార్టీలకతీతంగా ఈ కార్యక్రమాన్ని టీడీపీ చేపట్టింది. దీంతో పార్టీ జెండాలు ఎక్కడా కనిపించలేదు. జెండాలు మాత్రమే పాదయాత్రలో దర్శనమిస్తున్నాయి. జాతీయ జెండాలతో ఆర్కే బీచ్ కన్నులపండువగా మారిపోయింది. అడుగడుగునా చంద్రబాబుకు జన నీరాజనాలు పలుకుతున్నారు. విశాఖవాసులు చంద్రబాబు అడుగులో అడుగు కలిపారు. దీంతో ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


కాగా ఈ నెల 16వ తేదీ నుంచి అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. మూడు జిల్లాల్లో బాబు పర్యటన కొనసాగనుంది. 16వ తేదీ బుధవారం రాజమండ్రి విమానాశ్రయం నుండి బయలుదేరి మడికిదుళ్ళ మీదుగా మండపేట నియోజకవర్గంలోకి చంద్రబాబు ప్రవేశించనున్నారు. మండపేట మండలంలోని ఏడిద గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం బైపాస్ రోడ్డు మీదగా రాజారత్న సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్ షోగా వేగుళ్ళ వీర్రాజు సెంటర్‌కు చేరుకుని అక్కడ భవిష్యత్‌కు గ్యారంటీ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తారు.


ఇక 17వ తేదీన కొత్తపేట నియోజకవర్గంలో, 18న అమలాపురం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో బాబు పాల్గొననున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa