మహారాష్ట్రకు చెందిన ఓ ఎమ్మెల్యేకు భారీ లక్ కలిసి వచ్చింది. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్లాట్ ఆయనకు లాటరీలో దక్కింది. మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ - ఎంహెచ్డీఏ నిర్వహించిన లాటరీలో బీజేపీ ఎమ్మెల్యే నారాయణ్ కుచేకు ఫ్లాట్ వచ్చింది. దాని విలువ అక్షరాలా రూ. 7.58 కోట్లు. 1531 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఆ ఫ్లాట్ ముంబైలోని ఫ్లాట్ టార్డియోలోని క్రెసెంట్ టవర్లో ఉంది. జల్నా జిల్లాలోని బద్నాపూర్ నియోజకవర్గం నుంచి నారాయణ్ కుచే ఎమ్మెల్యేగా ఉన్నారు.
లాటరీలో ఫ్లాట్ గెలుచుకోవడం పట్ల ఎమ్మెల్యే నారాయణ్ కుచే ఆనందం వ్యక్తం చేశారు. ఈ లాటరీలో ఫ్లాట్ రావడంతో తనకు ముంబై నగరంలో ఇల్లు ఉండాలనే కల నెరవేరిందని చెప్పారు. ముంబైలో తనకు ఇల్లు లేకపోవడంతో మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ నిర్వహించే లాటరీ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే తాను బద్నాపూర్ నియోజకవర్గంలో ఉండగా ఫ్లాట్ గెలిచినట్లు సెల్ఫోన్లో మెసేజ్ వచ్చిందని చెప్పారు. ఈ ఫ్లాట్ గెలుచుకున్నందుకు దాన్ని సొంతం చేసుకునేందుకు లోన్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
క్రెసెంట్ టవర్ వద్ద ఉన్న ఈ ఫ్లాట్ను అధిక ఆదాయ వర్గాలైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ సభ్యులకు రిజర్వ్ చేశారు. అయితే ఈ ఫ్లాట్కు నారాయణ్ కుచేకు మరో పోటీదారుడిగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి డాక్టర్ భగవత్ కరద్ మాత్రమే ఉండగా.. నారాయణ్ కుచేకే అదృష్టం కలిసి వచ్చింది. అయితే పాత హౌసింగ్ విధానం ప్రకారం క్రెసెంట్ టవర్లో ఉన్న 7 ఫ్లాట్లను మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి లభించాయి. అయితే టార్డియో వద్ద ఉన్న ఫ్లాట్ ధర.. హౌసింగ్ అథారిటీ లాటరీలో మార్కెట్ ధర కంటే 25 శాతం నుంచి 30 శాతం తక్కువగా ఉంటుందని.. రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
2023 లో ప్రకటించిన హౌసింగ్ అథారిటీ లాటరీ విజేతలను సోమవారం ప్రకటించింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అక్కడే ఉన్నారు. ముంబైలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 4082 ఇళ్లకు లాటరీ నిర్వహించారు. ఇందులో 2790 ఇళ్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించారు. ఇందులో ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద 1947 ఫ్లాట్లు.. తక్కువ ఆదాయం కలిగిన వర్గాలకు ఫ్లాట్ల సంఖ్య 1034 కేటాయించారు. మధ్య ఆదాయ వర్గానికి 139 ఇళ్లు.. అధిక ఆదాయం కలిగి ఉన్న వర్గాలకు 120 రిజర్వ్ చేశారు. 4082 ఫ్లాట్లకు సంబంధించి 1,20,144 దరఖాస్తులను స్వీకరించినట్లు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తెలిపారు. ఇక అల్పాదాయ కేటగిరీలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఎమ్మెల్సీ అమశ్య పద్వీ.. గోరేగావ్లో ఫ్లాట్ గెలుచుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa