అది ఒక డిపార్ట్మెంటల్ స్టోర్. పట్టపగలు కస్టమర్లు, సిబ్బందితో ఆ డిపార్ట్మెంటల్ స్టోర్ రద్దీగా ఉంది. ఇంతలో అక్కడికి కొన్ని బీఎండబ్ల్యూ, లెక్సస్ వంటి కార్లు వచ్చి ఆగాయి. బాగా డబ్బున్న కస్టమర్లు వచ్చి ఉంటారని అందరూ భావించారు. కానీ ఆ కార్లలో నుంచి ముసుగులు వేసుకున్న కొంతమంది బయటికి దిగారు. వెంటనే లోపలికి వచ్చి ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ఖరీదైన వస్తువులను దోచుకున్నారు. అక్కడ ఉన్న కస్టమర్లు, సిబ్బంది చూస్తుండగానే క్షణాల్లో దొంగతనం చేసి బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను అక్కడ ఉన్నవారు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారాయి. ఈ హై ఫై దొంగతనం అమెరికాలో జరిగింది.
అమెరికాలో టొపంగా మాల్లోని నార్డ్స్ట్రామ్ డిపార్ట్మెంట్ స్టోర్లో ఈ దొంగతనం జరిగింది. దాదాపు 30 మంది వ్యక్తులు.. ఖరీదైన కార్లలో అక్కడికి వచ్చారు. ఎవరూ గుర్తించకుండా వారంతా ముసుగులు ధరించారు. ఆ డిపార్ట్మెంట్ స్టోర్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై పెప్పర్ స్ప్రేను కొట్టారు. అనంతరం వాళ్లంతా స్టోర్లోకి చొరబడ్డారు. అక్కడ ఉన్న ఖరీదైన బ్యాగులు, బట్టలు, విలువైన వస్తువులు దోచుకున్నారు. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు డిపార్ట్మెంట్ స్టోర్లో ఉన్న కస్టమర్లు, సిబ్బంది పేర్కొన్నారు. అయితే ఆ చోరీ జరిగిన తీరుతో అక్కడ ఉన్న వారంతా నోరెళ్లబెట్టారు.
ఈ సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని డిపార్ట్మెంట్ స్టోర్ సిబ్బంది లాస్ఏంజెల్స్ పోలీసులకు అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కస్టమర్లు, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. దొంగతనం సమయంలో ఆ 30 మంది దుండగులు హింసాత్మకంగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దుండగుల కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. అయితే వారు దోచుకున్న వస్తువుల విలువ లక్ష డాలర్లు మన కరెన్సీలో రూ.80 లక్షల వరకు ఉంటుందని డిపార్ట్మెంట్ స్టోర్ యాజమాన్యం పేర్కొంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa