గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో యశ్వంత్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీ యాజమాన్యం ఒత్తిడితోనే విద్యార్థి సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అధిక ఫీజు కోసం విద్యార్థిని అడ్మినిస్ట్రేటర్ ఎంవీ రావు వేధించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వేధింపులపై ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులకు యశ్వంత్ ఫిర్యాదు చేశాడు. అయినా వర్సిటీ యాజమాన్యం పట్టించుకోలేదు.
ఫీజుల ఒత్తిడితో మనస్తాపానికి గురై ఇవాళ ఉదయం యశ్వంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి ఆత్మహత్యపై కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం యశ్వంత్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందించారు. కొడుకు ఆత్మహత్యతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఘటనా స్థలంలో సూసైడ్ లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధిక ఫీజు వేధింపులపై వర్సిటీ యాజమాన్యానికి యశ్వంత్ ఫిర్యాదు చేసిన లేఖ కూడా పోలీసులకు చిక్కింది. 2019లో మేనేజ్మెంట్ కోటాలో తాను చేరానని, అప్పటినుంచి గడువులోగా ఫీజు చెల్లిస్తున్నట్లు తెలిపాడు. ఈ ఏడాదికి సంబంధించి ఏప్రిల్ 12న రూ.33 లక్షల ఫీజు ఇప్పటికే చెల్లించానని, అయితే మరో రూ.12 లక్షలు చెల్లించాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చినట్లు లేఖలో పేర్కొన్నాడు. తాను అంత చెల్లించలేనని చెప్పడంతో అవమానించినట్లు చెప్పాడు. వేధింపులు తట్టుకోలేకనే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ లేఖలో యశ్వంత్ తెలిపాడు. ఈ లేఖ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అయితే యశ్వంత్ ఎన్ఆర్ఐ వైద్య కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa