ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీల్డ్ కవర్‌లో కేసు డీటైల్స్ అందించిన ప్రభుత్వం,,,ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో తీర్పు రిజర్వు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 16, 2023, 06:49 PM

ఏపీలో సంచలనం రేపిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకు సంబంధించి ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు నిందితుడిగా ఉన్నారు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగిస్తేనే అసలు విషయాలు బయటకు వస్తాయని, తమకు న్యాయం జరుగుతూ సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.


ఇవాళ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగ్గా.. ఇరు వర్గాలు వాదోపవాదనలు వినిపించాయి. అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సీసీటీవీ ఫుటేజ్‌లో ఉన్నవారిని ఎందుకు కేసులో చేర్చలేదని హైకోర్టు ప్రశ్నించింది. కేవలం అనంతబాబును మాత్రమే చేర్చడం ఏంటని ప్రశ్నించింది. ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయలేదని, కేసును పోలీసులు నీరుగార్చేలా వ్యవహరించారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.


ఇప్పటికే ఈ కేసు వివరాలను ప్రభుత్వం సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు అందించింది. తీర్పును రిజర్వులో ఉంచగా.. త్వరలో హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది హాట్‌టాపిక్‌గా మారింది. సీబీఐకి అప్పగిస్తుందా? లేదా? అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు కొద్దిరోజుల పాటు రాజమండ్రి జైల్లో గడిపారు. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా తొలుత ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో అనంతబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు అనంతబాబుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో అనంతబాబు జైలు నుంచి బయటకొచ్చారు. జైలు నుంచి బయటకొచ్చే సమయంలో ఆయనకు వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలకడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa