తిరుమలలో గత కొద్దిరోజులుగా చిరుతలు సంచరిస్తున్నాయి. నడకమార్గంలో చిరుతలు కనిపిస్తుండటంతో.. భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతల దాడిలో నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన నేపథ్యంలో టీటీడీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే చిరుతలను పట్టుకునేందుకు తిరుమలలో బోన్లు ఏర్పాటు చేసింది. అలాగే భక్తులకు భద్రత కోసం నిన్నటి నుంచి చేతి కర్రలను అందిస్తోంది.
తిరుమలలో చిరుతల సంచారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఈ క్రమంలో చిరుతల సంచారంపై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్కు పాల్పడుతున్నారని, అందుకే చిరుతలు బయటకు వస్తున్నాయని ఆరోపించారు. వైసీపీ నేతలు యధేచ్చగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారని, అందుకోసం అడవులను నరికేయడం వల్లనే చిరుతలు బయటకు వస్తున్నాయన్నారు. వైసీపీలో 'పుష్ప'లు ఎక్కువయ్యారని విమర్శించారు.
ఈ సందర్భంగా భక్తులకు చేతి కర్రలు అందిస్తుండటంపై బోండా ఉమా ఫైర్ అయ్యారు. ఆ కర్రలతో ప్రభుత్వానికి బడితపూజ చేయాలని వ్యాఖ్యానించారు. చిరుతలను కట్టడి చేయడంపై భక్తులకు సరైన సమాధానం చెప్పుకోలేక కర్రలు ఇస్తారా? అంటూ మండిపడ్డారు. భక్తుల భద్రతపై టీటీడీ చేతులెత్తేసిందని ఆరోపించారు. వైసీపీ నేతలు ఎర్రచందనంతో పాటు కలపను ఇష్టారాజ్యంగా నరికివేస్తున్నారన్నారు. అటు ప్రభుత్వ పథకాలను తక్కువ మందికి ఇవ్వాలని వైసీపీ చూస్తోందని, ఒంటి మీద మంచి బట్టలు ఉన్నా పథకాలను రద్దు చేస్తున్నారంటూ సెటైర్లు పేల్చారు.
శ్రీవారి భక్తులపై కఠిన ఆంక్షలు విధించడంపై శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో హిందూ జేఏసీ టీటీడీ పరిపాలన భవనం ముందు ఆందోళనలు వ్యక్తం చేస్తోంది. నడకదారి భక్తులపై పెట్టిన ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలని, ఉదయం ఐదు నుంచి సాయంత్రం వరకు భక్తులను నడకమార్గంలో అనుమతించాలని డిమాండ్ చేశారు. ద్విచక్ర వాహనాలను ఘాట్ రోడ్లలోకి అనుమతించాలని, టీటీడీ నిబంధనల వల్ల భక్తుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని చెప్పారు.
టీటీడీ నిర్ణయాలు సామాన్య భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, వైసీపీ ప్రభుత్వంలో ఎంతోమంది హిందువులు ఉండగా.. నాస్తికుడైన భూమన కరుణాకర్ రెడ్డికి ఎందుకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందని, టీటీడీ ధార్మిక సంస్థ రాజకీయ పునరావాస కేంద్రం కాదని మండిపడ్డారు. కరుణాకర్ రెడ్డి వెంటనే టీటీడీ చైర్మన్ పోస్ట్ నుండి దిగిపోవాలని, రానున్న రోజుల్లో హిందూ ధార్మిక సంస్థలతో కలిసి టీటీడీని కాపాడుకుంటామని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa