సాధారణంగా భారత్, పాక్ అంటే చిరకాల ప్రత్యర్థులు అనే పేరు ఉంటుంది. క్రీడల నుంచి మొదలుకుంటే రాజకీయాలు, సరిహద్దుల వరకు అదే తీరు కనిపిస్తుంది. ఇక స్వాతంత్య్ర దినోత్సవం అంటే పోటా పోటీగా వేడుకలు నిర్వహించుకుంటారు. అయితే ఈసారి ఇండిపెండెన్స్ డేకు ఒక అరుదైన దృశ్యం కనిపించింది. భారతీయులు, పాక్ పౌరులు అంతా కలిసి ఒకే చోట స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకున్నారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే బ్రిటన్లోని లండన్ వీధుల్లో. బాలీవుడ్ పాటలకు భారత పౌరులు వేడుకలు జరుపుకుంటుంటే అక్కడే ఉన్న పాక్ ప్రజలు అందులో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో రెండు దేశాల ప్రజలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
లండన్లోని పికాడిల్లీ సర్కస్లో ఈ అత్యంత అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. భారతీయులు, పాక్ పౌరులు.. తమ తమ దేశాల జాతీయ జెండాలు పట్టుకుని పాటలు పాడారు. భారత 77 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్కు చెందిన మ్యుజిషియన్, ఇన్స్టాగ్రామ్లో పాపులర్ అయిన విష్.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని భారత్, పాక్ పౌరులను తాను కోరినట్లు విష్ తెలిపారు. లండన్ వీధుల్లో బాలీవుడ్ పాటలైన 'తేరీ మిట్టి', 'జై హో', 'మా తుజే సలామ్', 'సందేసే ఆతే హై' వంటి పాటలను పాడారు. ఈ పాటలకు అక్కడి భారతీయులు ఉర్రూతలూగిపోయారు. దీంతో అక్కడే ఉన్న పాకిస్థానీయులు కూడా ఆ గుంపులో చేరి సంబరాలు జరుపుకున్నారు. పాకిస్థాన్ కూడా తన 77 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని భారత్ కంటే ఒకరోజు ముందు సోమవారం నిర్వహించుకుంది.
ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో కామెంట్ల వర్షం కురుస్తోంది. భారత్, పాక్ ప్రజలు కలిసిపోవడంపై ఆశ్చర్యపోయిన నెటిజన్లు.. రెండు దేశాల ప్రజలను విష్ ఒకేతాటిపైకి తీసుకువచ్చారని ప్రశంసల జల్లు కురిపించారు. ఇరు దేశాల ప్రజలకు చాలా మంది నెటిజన్లు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటిష్ వారి ద్వారా విభజించబడిన భారత్, పాక్ దేశాలకు చెందిన ప్రజలు మళ్లీ బ్రిటన్లోనే ఏకమయ్యారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అఖండ భారతదేశ స్వాతంత్య్రాన్ని దొంగిలించిన బ్రిటీష్ గడ్డపై ఇరు దేశాలు వేడుకలు జరుపుకున్నాయని ఇంకొందరు పేర్కొంటున్నారు. భారత్, పాక్ దేశాల మధ్య ఎన్ని వివాదాలు ఉన్నా ఒకరి పండగను మరొకరు కలిపి జరుపుకోవడం చాలా శుభ పరిణామమని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa