తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ నెల 21న ఆయన అమరావతి పర్యటనకు రానున్నారు. బండి సంజయ్ సేవలను ఏపీలో మరింత వాడుకోవాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఏపీలో ఓటర్ నమోదు ప్రక్రియను బండి సంజయ్ సమీక్షించనున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గోవా, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాల్లో బండి సేవలను వినియోగించుకోవాని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.
బండి సంజయ్ ఎంట్రీతో ఏపీ రాజకీయాలు పూర్తిగా మారనున్నాయి. వైసీపీతో అమీతుమీకి బీజేపీ సిద్దమైందని, త్వరలో బీజేపీ వైఖరి మారుతుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం వైసీపీ పట్ల బీజేపీ మెతక వైఖరిని ప్రదర్శిస్తుందనే చర్చ బలంగా ఉంది. త్వరలో బీజేపీ తన వైఖరిని మార్చుకుంటుందని, వైసీపీ సర్కార్పై అమీతుమీకి సిద్దమైందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పదునైన వ్యాఖ్యలతో ప్రత్యర్థులపై బండి సంజయ్ విరుచుకుపడుతూ ఉంటారు. ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలో తన వాయిస్ బలంగా వినిపిస్తూ ఉంటారు.
ఈ క్రమంలో బలమైన వాయిస్ వినిపించే బండి సంజయ్ ఏపీలో అడుగుపెడితే పాలిటిక్స్ మరింత హీటెక్కే అవకాశముంది. ఇప్పటికే ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ, జనసేన బలంగా పోరాడుతున్నాయి. ఇప్పుడు బీజేపీ కూడా అదే పంథాలో వెళితే వైసీపీ సర్కార్కు ఉక్కబోత తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలపై అంతగా ఫోకస్ పెట్టకపోయినా.. లోక్సభ సీట్లపై మాత్రం బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టనుంది. విశాఖపట్నం, రాజంపేట, తిరుపతి లాంటి పార్టీకి కాస్త బలం ఉన్న పార్లమెంట్ సీట్లపై బీజేపీ కన్నేసింది. ఇప్పటికే విశాఖపట్నంలో అమిత్ షా కొద్ది నెలల క్రితం బహిరంగ సభ నిర్వహించారు.
బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా విశాఖలోనే ఎక్కువగా ఉంటున్నారు. విశాఖలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున జీవీఎల్ పోటీ చేస్తారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. అందుకే ఆయన ఎక్కువగా విశాఖలోనే ఉంటున్నారని, పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే తిరుపతి లోక్సభ పరిధిలో కూడా బీజేపీకి చెప్పుకోదగ్గ స్థాయిలో క్యాడర్ ఉంది. దీంతో బండి సంజయ్కు ఉన్న మాస్ ఫాలోయింగ్ దృష్ట్యా.. లోక్సభ స్థానాల్లో పార్టీ బలోపేతానికి ఆయనను బీజేపీ ఉపయోగించుకోనుందని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa