మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. కుకీ తెగకు చెందిన ముగ్గురికి కాల్చి చంపేశారు దుండగులు. కుకీ ప్రజలు నివసించే తొవాయి కుకీ గ్రామ శివార్లలోని గుట్టల మాటు నుంచి శుక్రవారం (ఆగస్టు 18) వేకువజామున 4.30 గంటల సమయంలో కాల్పులు జరిపారు. ఈ ఘటనతో మణిపూర్లో మళ్లీ ప్రకంపనలు రేగుతున్నాయి. 15 రోజుల విరామం తర్వాత రాష్ట్రం మళ్లీ నివురు గప్పిన నిప్పులా మారింది. చివరిసారిగా ఆగస్టు 5న వేర్వేరు చోట్ల జరిగిన హింసాత్మక ఘటనలో ఐదుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మెయితీ తెగకు చెందిన వారు కాగా.. మరో ఇద్దరు కుకీ తెగకు చెందినవారు. మణిపూర్లో మే 3వ తేదీ నుంచి తెగల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.
శుక్రవారం ఉదయం జరిగిన ఘటనలో కుకీ తెగకు చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారని ఉఖ్రుల్ జిల్లా పోలీసు అధికారి ఎన్. వాషుమ్ తెలిపారు. ఉదయం 4.30 గంటల సమయంలో ఉఖ్రుల్ జిల్లా కేంద్రానికి 47 కి.మీ. దూరంలో కుకీ తెగవారు నివసించే తోవాయి కుకీ గ్రామంపైకి కొండపై నుంచి సాయుధులైన దుండగులు కాల్పులు జరిపాయని ఆయన వెల్లడించారు. మణిపూర్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని క్షణక్షణం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఘర్షణల నేపథ్యంలో గ్రామస్థులు బృందాలుగా విడిపోయి, వంతులు వారీగా కాపలా కాస్తున్నారు. తొవాయి కుకీ గ్రామంలో అలా కాపలా కాస్తున్న గ్రామస్థులపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు జిల్లా పోలీసు అధికారి తెలిపారు. నిందితుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించారు.
మణిపూర్లో శాంతి నెలకొల్పేందుకు ఇండియన్ ఆర్మీ అక్కడి పోలీసులతో కలిసి తీవ్రంగా కృషి చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా నివారించగలిగారు. సున్నితమైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. మణిపూర్లో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 3000 మందికి పైగా గాయపడ్డారు. 50 వేల మంది నిరాశ్రయులయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa