గోదావరి జిల్లాల్లో పులస చేప చాలా ఫేమస్. ఈ వానల సీజన్లో తొలకరి తర్వాత గోదావరికి ఎర్ర నీరు పోటెత్తిన సమయంలోనే పులసలు దొరుకుతాయి. ఈ ఏడాది మాత్రం పులసలు కాస్త తక్కువగానే మార్కెట్లోకి వస్తున్నాయి. గత నెలలో ఒకటి రెండుసార్లు మాత్రమే మత్స్యకారుల వలకు చిక్కగా మళ్లీ చాలా రోజుల తర్వాత పులస దొరికింది. కాకినాడకు సమీపంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో రెండు కిలోల పులస చేప చిక్కింది. ఆ పులస చేపను మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. మత్స్యకార మహిళ రత్నం అమ్మకానికి పెట్టడంతో కొనుగోలు చేసేందుకు పులస ప్రియులు ఎగబడ్డారు. ఈ చేప రికార్డు స్థాయిలో ఏకంగా రూ.16వేలకు అమ్ముడుపోయింది. గతంతో పోలిస్తే.. గోదావరిలో పులస చేప రాక బాగా తగ్గిందనే చెబుతున్నారు స్థానికులు. అంతేకాదు కొందరు నకిలీ పులస చేపల్ని తీసుకొచ్చి మార్కెట్లో అమ్మేస్తున్నారు.
గోదావరి జిల్లాల్లో ఉండే జనాలు ఒక్కసారైనా పులస రుచి చూడాలని భావిస్తారు. అందుకే మార్కెట్లోకి అలా రాగానే.. ఇలా అమ్ముడుపోతున్నాయి. కొందరైతే ఎంత డబ్బు ఖర్చు చేయడానికైనా వెనుకాడరు.. అలా ఉంది మరి పులస క్రేజ్. గోదావరికి ఈ చేప అతి వేగంగా ఎదురీదుతుంది.. సుదూర ప్రాంతాల నుంచి బంగాళాఖాతంలోకి వస్తుంది. ఇవి సంతానోత్పత్తి కోసం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి వస్తాయట. ఈ చేపలు సీజన సమయంలో.. ఆషాడ, శ్రావణ మాసాల్లో గోదావరిలో గుడ్లు పెట్టి మళ్లీ సముద్రంలోకి తిరిగి వెళ్లిపోతుందని మత్స్యకారుల చెబుతుంటారు. ఈ చేపను ఇలసగా పిలుస్తారు.. చేప గోదావరిలోకి ఎర్రనీరు రాగానే ఎదురీదుతూ నదిలోకి వచ్చి రెండు మూడు రోజుల్లోనే పులసగా మారుతుంది అంటున్నారు. పులస శాస్త్రీయ నామం హిల్సాహిల్సా.. గోదావరి జిల్లాలతో పాటుగా ఒడిశా, బంగ్లాదేశ్ తీరాల్లో ఉంటాయంటున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని అంతర్వేది, భైరవపాలెం, నరసాపురంలో కనిపిస్తాయని చెబుతున్నారు. గోదావరి జలాలు సముద్రంలో కలిసే రెండు పాయల దగ్గరే ఈ పులసలు దొరుకుతాయి అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa