ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నకిలీ సర్టిఫికేట్‌తో బురిడీ యత్నం,,,అడ్డంగా దొరికిపోయిన యువకుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 23, 2023, 07:49 PM

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 పరీక్షల్లో ఎంపికైన ఓ యువకుడు అధికారుల్ని బురిడీ కొట్టించబోయాడు. తప్పుడు ధ్రువ పత్రంతో మోసం చేసేందుకు ప్రయత్నించాడు. కానీ అనుకోకుండా అడ్డంగా దొరికిపోగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీపీఎస్సీ 111 పోస్టుల కోసం కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 2 నుంచి 11వ తేదీ వరకు విజయవాడలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం గుండవనపల్లికి లోకేష్‌ ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 పరీక్షల్లో ఎంపికయ్యాడు.


ఎంపికైన అభ్యర్థులను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ జీజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. లోకేష్‌ వైద్య పరీక్షల అనంతరం 167.7 సెం.మీ. ఎత్తు ఉన్నట్లు నిర్ధారిస్తూ ఇచ్చిన ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ను అధికారులకు సమర్పించారు. లోకేష్‌ సమర్పించిన సర్టిఫికెట్లో 167.7 సెం.మీ. ఎత్తు ఉన్నట్లు ఉండటంతో.. అధికారులకు ఎందుకో అనుమానం వచ్చింది. అంత ఎత్తు ఉండడని భావించి.. 4 నుంచి 5 సెం.మీ. వరకు తేడా ఉండటంతో సెకండ్‌ ఒపీనియన్‌ కోసం వేర్వేరు చోట్ల వైద్య పరీక్షలకు పంపించారు.


రెండో సారి వచ్చిన ధ్రువీకరణ పత్రంలో లోకేష్‌ ఎత్తు 167 సెంటీమీటర్లుగా తేలింది. ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం అభ్యర్థి 167.6 సెం.మీ. ఎత్తు ఉండాలి. కానీ ఎత్తు తక్కువ ఉండటంతో.. తప్పుడు ధ్రువపత్రం సమర్పించి ఉండొచ్చని ఏపీపీఎస్సీ అధికారులు అనుమానించారు. కేసును విజయవాడ పోలీసు అధికారులకు పంపించగా.. పోలీసు అధికారులు, తూనికలు కొలతల శాఖ అధికారుల సమక్షంలో మరోసారి లోకేష్‌ ఎత్తు కొలిచారు. ఎత్తు తక్కువగా ఉన్నట్లు తేలటంతో.. తప్పుడు ధ్రువపత్రం సమర్పించినట్లు తేల్చారు.. వెంటనే సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.


పోలీసులు లోకేష్‌పై ఏపీ మాల్‌ప్రాక్టీసెస్‌ నిరోధక చట్టం 1997, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు తప్పుడు ధ్రువపత్రం సృష్టించి ఇచ్చాడా.. లేక వైద్య సిబ్బందే ప్రలోభాలకు లొంగి తప్పుడు ధ్రువపత్రం ఇచ్చారా అనేది తేలాల్సి ఉంది. అతడి దొరికితేనే ఈ అనుమానాలకు సమాధానం దొరుకుతుందని పోలీసులు అంటున్నారు. ధ్రువపత్రంపై వైద్యుడి పేరు, సంతకం తదితర విషయాలపై ఆరా తీస్తున్నారు. ఈ మోసంలో వైద్యుల పాత్ర ఉంటే.. వారిపైనా కేసు నమోదు చేస్తామని ఏసీపీ రవికాంత్‌ తెలిపారు.


ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 (28/2022 నోటిఫికేషన్‌) ఉద్యోగాలకు ఎంపిక చేసిన అభ్యర్థులను ప్రకటిచారు. 111 ఉద్యోగాల భర్తీకి ఎంపిక చేసిన వారిలో 33 మంది మహిళలు ఉన్నారు. అయితే ఈ 111 ఉద్యోగాల్లో ఒక పోస్టును స్పోర్ట్స్‌ కోటాలో భర్తీపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa