ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యా సంస్థలు, ప్రభుత్వ ఆఫీసులకు 3 రోజులు సెలవులు

national |  Suryaa Desk  | Published : Fri, Aug 25, 2023, 09:34 PM

ప్రతిష్ఠాత్మకమైన జీ 20 దేశాల శిఖరాగ్ర సమావేశాలకు ఈసారి భారత్ అధ్యక్షత వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా వివిధ సమావేశాలు, కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ రెండో వారంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే జీ 20 దేశాలకు చెందిన అధినేతలు భారత్‌కు రానున్నారు. ఇందులో భాగంగానే ఎన్నో భద్రతా పరమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అయితే వీటికి సంబంధించి ఇప్పటికే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగానే సమావేశాలు జరగనున్న 3 రోజుల పాటు దేశ రాజధానిలో సెలవులు ప్రకటిస్తూ కేంద్ర సిబ్బంది, వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.


దేశ రాజధాని ఢిల్లీలోని అన్ని విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు సెప్టెంబర్‌ 8 వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మూసే ఉంటాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జీ 20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశాలు సెప్టెంబరు 7 వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే ఆయా సభ్య దేశాల అధినేతల భేటీ మాత్రం సెప్టెంబరు 9, 10 వ తేదీల్లో జరగనుంది. భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ జీ 20 దేశాధినేతల సదస్సుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది.


జీ-20 ప్రపంచ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 9, 10 తేదీల్లో హస్తినలో జరగనుంది. ఈ సమావేశానికి 29 దేశాల అధినేతలతో పాటు ఐరోపా సమాఖ్య, ఆహ్వానిత అతిథి దేశాలు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు, ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. G-20 అధ్యక్ష బాధ్యతల్ని 2022 డిసెంబర్ 1న ఇండోనేసియా నుంచి భారత్ స్వీకరించింది. జీ-20 సమావేశం దృష్ట్యా దిల్లీలోని బ్యాంకులు, వాణిజ్య సంస్థలు, మార్కెట్లు సహా అన్ని ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు 3 రోజులు మూసివేయనున్నారు.


జీ 20 దేశాధినేతల సమావేశాల కోసం ఆతిథ్య వేదికను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఆధీనంలో ఉన్న విశాలమైన కాంప్లెక్స్‌ను రీ డెవలప్ చేసింది. 123 ఎకరాల్లో ఉన్న ఈ కాంప్లెక్స్.. దేశంలోనే అతిపెద్ద సమావేశ కేంద్రం. రీ డెవలప్ చేసిన తర్వాత ఈ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్.. ప్రపంచంలోని టాప్ 10 ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కాంప్లెక్స్‌లలో చోటు సంపాదించింది. జర్మనీలోని హన్నోవర్ ఎగ్జిబిషన్ సెంటర్, షాంఘైలోని నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ వంటి వాటితో పోటీ పడుతోంది. ఇందులో 3 వేల మంది కూర్చునే సామర్థ్యంతో 3 పీవీఆర్ థియేటర్‌లకు సమానమైన గ్రాండ్ యాంఫి థియేటర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో సాంస్కృతిక ప్రదర్శనలు, వినోద కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. సందర్శకుల కోసం 5,500 వాహనాల పార్కింగ్ చేసే విశాల స్థలం ఉంది. సిగ్నల్ లేని రోడ్లతో సులభంగా సందర్శకులు ఈ కాంప్లెక్స్‌కు చేరుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa