గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య నుంచి ప్రాణహాని ఉందంటున్నారు వాలంటీర్. ఆయ నుంచి తమకు రక్షణ కల్పించాలని ఆ నియోజకవర్గంలోని మన్నవ గ్రామ వాలంటీర్లు అన్నవరపు రవితేజ, రమేష్ బాబు, అమర్, దళిత సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ను కలిసి ఫిర్యాదు చేశారు.. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. వైఎస్సార్సీపీ గెలుపు కోసం ఏళ్లుగా కష్టపడ్డామన్నారు వాలంటీర్ రవితేజ. ఎన్నో కేసుల్లో ఇరుక్కున్నామని.. తన్నులు తిన్నామన్నారు.
గత ఎన్నికల్లో కిలారి రోశయ్యకు టిక్కెట్ ఇస్తే, పార్టీ పెద్దల ఆదేశాలతో కష్టపడి గెలిపించుకున్నామన్నారు. తర్వాత తాము గ్రామ వాలంటీర్లుగా చేరామని.. రోశయ్య గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో దోచేస్తున్నారని ఆరోపించారు. మన్నవ ఎస్సీ గ్రామంలో అభివృద్ధి లేదని.. పార్టీపరంగా ఏమీ చేయలేదన్నారు. వరి పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 26న గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా గ్రామ సచివాలయంలో సమావేశం పెట్టి బెదిరించినట్లు వాలంటీర్లు ఆరోపిస్తున్నారు.
వాలంటీర్లు ఎంతమంది వచ్చారని అడిగి.. తాము పేర్లు చెబుతుంటే.. అందర్నీ గుర్తుపెట్టుకుంటా.. ఏ ఒక్కరినీ వదిలిపెట్టను, అంతు తేలుస్తానని ఎమ్మెల్యే బెదిరించారని చెబుతున్నారు. తమపై దుర్భాషలాడారని. ఏదైనా పనికోసం వెళ్తే తిడుతున్నారన్నారు. తమ ఉద్యోగాలు తీయించేస్తానని బెదిరిస్తున్నారని.. కష్టపడి గెలిపిస్తే తమకు ఇచ్చే విలువ ఇదేనా అంటూ ప్రశ్నించారు. రోశయ్య నుంచి ప్రాణరక్షణ కల్పించాలని ఎస్పీని కోరామన్నారు. ఈనెల 25న పొన్నూరు పట్టణ వైఎస్సార్2సీపీ దళిత నాయకుడు జంగా రాజేష్పై కూడా రోశయ్య తన వర్గీయులను పంపించి రౌడీయిజం చేయించారని ఆరోపించారు. గతంలో కార్యకర్త కంచర్ల మహేశ్పాల్ అనే వ్యక్తిపైనా దాడి చేయించారని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుచేసి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు. అలాగే పోలీసు కార్యాలయంలో 'రోశయ్య వద్దు.. జగనన్న ముద్దు' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వాలంటీర్ల వెంట దళిత సంఘాల నేతలు కూడా వెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa