రాఖీ పండగ సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బస్సులలో మహిళలకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తూ ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల పాటు అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ప్రయాణించవచ్చని తెలిపింది. ఈసారి రాఖీ పండగ 2 రోజులు రావడంతో రెండు రోజుల పాటు ఈ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు కల్పించింది. ఉత్తర్ప్రదేశ్లోని మహిళలు, తల్లులు, సోదరీమణులు, బిడ్డలు ఈ రాఖీ పండగను ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. దీంతో మహిళల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.
రాఖీ పౌర్ణమి సందర్భంగా రెండు రోజుల పాటు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ట్వీట్ చేశారు. ఆగస్టు 30, 31 వ తేదీల్లో ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఎలాంటి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆగస్టు 29 వ తేదీ రాత్రి 12 గంటల నుంచి ఆగస్టు 31 వ తేదీ రాత్రి 12 గంటల వరకు అన్ని బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుందని తెలిపారు. రక్షా బంధన్ పండగ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించినందుకు.. కొత్త గ్యాస్ కనెక్షన్లు ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు.. ఈ సందర్భంగా 100 అభివృద్ధి పనులకు సంబంధించి రూ. 2009 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వంట గ్యాస్ ధరను రూ. 200 తగ్గించినందుకు.. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన కింద కొత్తగా మరో 75 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించడంపై ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పిన యోగి ఆదిత్యనాథ్.. రక్షా బంధన్ వేళ.. చెల్లెల్లకు ఇది బహుమతి అని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa