ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియా కూటమికి భారత్ అనే కొత్త పేరు,,,,కేంద్రం తాజాగా చర్యలతో తెరపైకి భారత్

national |  Suryaa Desk  | Published : Wed, Sep 06, 2023, 08:59 PM

కేంద్ర ప్రభుత్వం ఇండియా పేరును భారత్‌గా మార్చనున్నట్లు వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో మోదీ సర్కార్‌పై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ప్రతిపక్షాల కూటమికి ఇండియా అనే పేరును పెట్టుకున్నందుకే బీజేపీ.. దేశం పేరును మార్చుతోందని మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త అంశం తెరపైకి వచ్చింది. విపక్ష కూటమి పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చితే అప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం.. మళ్లీ భారత్ అనే పేరును కూడా మార్చుతుందా అంటూ పలువురు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమికి భారత్ అనే అర్థం వచ్చేలా కొత్త పేరును సూచించారు.


ఇండియా, భారత్‌ పేర్ల మార్పుపై ఇటీవల తలెత్తిన వివాదం నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కార్‌పై తన మార్క్ విమర్శలు గుప్పించారు. దేశం పేరును ఇండియా నుంచి భారత్ అని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఈ క్రమంలోనే ఇండియా కూటమి పేరును కూడా భారత్ అని మార్చితే సరిపోతుందని కొత్త అర్థం వచ్చేలా పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆయన భారత్ అంటే కొత్త అర్థం వచ్చేలా ఫుల్‌ఫామ్‌ను కూడా సూచించారు. ఇప్పటివరకు ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయన్స్‌ ఇండియా అనే స్థానంలో ‘అలయన్స్‌ ఫర్‌ బెటర్‌మెంట్‌ హర్మనీ అండ్‌ రెస్పాన్సిబుల్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఫర్‌ టుమారో’ భారత్ అనే పేరును మార్చితే సరిపోతుందని పేర్కొన్నారు. దీంతో బీజేపీ చేస్తున్న పేర్ల రాజకీయానికి చెక్‌ పెట్టినట్లు అవుతోందని శశిథరూర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


అంతకుముందు ఇండియా అంటే భారత్‌, భారత్‌ అంటే ఇండియా అని ఉన్నందున దీన్ని ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదని, దీని కోసం తీర్మానం చేయాల్సిన అవసరం లేదని శశిథరూర్‌ పేర్కొన్నారు. ఇప్పుడు భారత్‌ అని పిలిచేందుకు రాజ్యాంగపరంగా ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. దేశానికి ఉన్న రెండు అధికారిక పేర్లలో ఇండియా కూడా ఒకటి అని గుర్తు చేశారు. అయితే ఎన్నో శతాబ్దాలుగా అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన ఇండియా పేరును తొలగించేంత తెలివి తక్కువగా ప్రభుత్వం ఆలోచిస్తుందని తాను అనుకోవడం లేదని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చారిత్రకంగా గుర్తింపు పొందిన పేరును వదులుకోవడానికి బదులు రెండు పేర్లను కొనసాగించడం మేలు అని ఈ సందర్భంగా శశిథరూర్ కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేశారు.


ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకంగా భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ 20 సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సెప్టెంబరు 9వ తేదీన ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇప్పటికే అతిథులకు ఆహ్వానం అందింది. అయితే ఈ ఆహ్వానంపై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ప్రచురించి ఉంది. దీనికి తోడు ఇవాళ విడుదల చేసిన ప్రధాని ఇండోనేషియా పర్యటనకు సంబంధించిన ప్రకటనలోనూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం గమనార్హం. ఈ చర్యలతో త్వరలోనే ఇండియా అనే పేరును భారత్ అని మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa