ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతి శ్రీనివాస సేతు ప్రారంభోత్సవం,,,పెండింగ్ పనులు పూర్తి చేయాలన్న ఈవో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 07, 2023, 08:12 PM

శ్రీనివాస సేతును సెప్టెంబ‌రు 18వ తేదీన‌ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప్రారంభించేందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాల‌ని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. బుధవారం టీటీడీ పరిపాలన భవనంలోని ఛాంబర్‌లో టీటీడీ, మున్సిపల్ అధికారులతో శ్రీనివాస సేతు నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. శ్రీనివాస సేతు నిర్మాణ పనులు సెప్టెంబ‌రు 15వ తేదీకి పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.


ఇంకా పెండింగ్‌లో ఉన్న సెంట్రల్ డివైడర్లు, కాలువలు, ఫుట్‌పాత్‌లు, వీధుల ఆధునీకరణ, పెయింటింగ్, క్రాష్ బ్యారియ‌ర్లు, బి.టి.రోడ్డు, సుందరీకరణ త‌దిత‌ర ప‌నుల‌ను సెప్టెంబ‌రు 15 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్ హరితను కోరారు ఈవో. సెప్టెంబ‌రు 12 నుంచి శ్రీనివాస సేతుపై ట్రైయ‌ల్ ర‌న్ నిర్వ‌హించాల‌న్నారు. భక్తుల కోసమే తిరుపతిలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు ప్రయాణించే 11 రోడ్లు టీటీడీ పరిధిలో ఉన్నాయని.. వీటిలో నారాయణాద్రి ఆసుపత్రి కూడలి నుంచి తిరుచానూరు వైపు వెళ్లే బైపాస్‌ కూడా ఉందన్నారు. దీనిని నాలుగు వరుసల కింద విస్తరించాలని నిర్ణయించామని చెప్పారు.


శ్రీనివాసం వసతి సముదాయం దగ్గర యాత్రికులు ట్రాఫిక్‌ సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇక్కడ ప్రధాన ప్రవేశమార్గాన్ని వైఎస్‌ఆర్‌ మార్గం వైపు మార్చాలని చాలా రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నామన్నారు. స్విమ్స్‌, బర్డ్‌, శ్రీపద్మావతి చిన్నపిల్లల గుండె ఆసుపత్రి, శ్రీపద్మావతి మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రి, ఆయుర్వేద ఆసుపత్రి, ఫిజియోథెరపీ కళాశాలలకు ప్రత్యేకంగా డ్రైనేజ్‌ పైప్‌లైన్‌ లేనందున మున్సిపల్‌ కార్పొరేషన్‌ డ్రైనేజీ వ్యవస్థకు అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులకు టీటీడీ పాలక మండలిలో తీర్మానం చేసినట్లు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.


ఎస్వీ సంప్ర‌దాయ శిల్ప శిక్ష‌ణ సంస్థ‌లో చదువుతున్న విద్యార్థులు చక్కటి ఉపాధి పొందేలా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటామని టీటీడీ జేఈవో సదా భార్గవి తెలిపారు. సంప్రదాయ ఆలయ శిల్పకళలు – అనుబంధ అంశాలపై మూడు రోజుల పాటు జరిగిన వ‌ర్క్‌షాప్ ముగిసింది. మూడు రోజులు పాటు జరిగిన ఈ వర్క్ షాప్ లో వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన నిష్ణాతులు శిల్పకళలో మెలకువలపై విద్యార్థులకు చక్కటి అవగాహన కల్పించినట్లు చెప్పారు జేఈవో. విద్యార్థుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని, చక్కటి సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. భవిష్యత్తులో ఏడు రోజుల వర్క్ షాప్ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. పలువురు విద్యార్థులు 3d యానిమేషన్ డిప్లమా కోర్సులు కోర్సులు, సాయంత్రం కోర్సులు ప్రవేశపెట్టాలని కోరారని, వీటిపైన ఆలోచిస్తామని తెలిపారు.


చివరిరోజు మహాబలిపురానికి చెందిన స్థపతి టి.కదిరివన్ “దారుశిల్పం తయారీలో సాంకేతిక అంశాలు” అనే అంశంపై, బెంగళూరుకు చెందిన డా. గోపాలక్రిష్ణ “హంపిలోని విజయనగర రాజుల కాలంనాటి దేవాలయ శిల్పకళ ” అనే అంశంపై ఉప‌న్య‌సించారు. అదేవిధంగా, తిరుపతి వేదిక్ యూనివర్శిటీ వైఖానస ఆగమ విభాగ అధ్యక్షులు డా. టి.బ్రహ్మాచార్యులు “వేదాలు, ఆగమాలు, భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం” అనే అంశంపై, మైసూరుకు చెందిన స్థపతి టి. దేవేంద్ర ఆచారి “దేవాలయాలు, శిల్పాలపై 3డి విజువలైజేషన్” అనే అంశాలపై ప్రసంగించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa