ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖపట్నం నుంచి మళ్లీ ఎంపీగా పోటీ చేస్తా.. జేడీ లక్ష్మీనారాయణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 07, 2023, 08:08 PM

వచ్చే ఎన్నికలలో తాను మరోసారి విశాఖపట్నం నుంచే పోటీ చేస్తానన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. గతంలో విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీచేస్తే మూడు లక్షల ఓట్లు తనకు లభించాయన్నారు. అలాంటి చైతన్యవంతమైన విశాఖపట్నం నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నాను అన్నారు. గతంలో విశాఖపట్నం నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.. ప్రస్తుతం తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. తనను రోజుకు రెండు మూడు పార్టీల వారు కలుస్తున్నారన్నారు.


ఏ పార్టీ నుండి పోటీ చేసేది తన మిత్ర బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాను అన్నారు. జమిలీ ఎన్నికలు మంచి నిర్ణయమే కానీ అవి అమలు చేయాలంటే రాజ్యాంగంలో ఐదు రకాల మార్పులు చేయవలసి ఉంటుందన్నారు. జమిలీ ఎన్నికల వలన ఖర్చు తగ్గుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జేడీ లక్ష్మీనారాయణ తెనాలి మండలం అత్తోటలో భూమి భారతి వ్యవసాయ క్షేత్రంలో పర్యటించారు. వ్యవసాయ క్షేత్రంలో మిగతా రైతులతో కలిసి నాట్లు వేశారు.


పిల్లలకి వ్యవసాయం అంటే ఏమిటో నేర్పించాలన్నారు లక్ష్మీనారాయణ. నారుమడి, వరి చేను, నాట్లు ఎలా వేస్తారు వంటి విషయాలను స్కూల్ పిల్లలకు తెలియజేసేందుకు, ప్రాక్టికల్‌గా చూపించేందుకు ఈ వ్యవసాయ క్షేత్రంలో నాట్లు వేసినట్లు చెప్పారు. ఈతరం పిల్లలకు బియ్యం ఎలా తయారవుతుందో తెలియకపోవటం చాలా బాధాకరమని.. వారిలో చైతన్యం కలిగించేందుకే తాను ఇలా రైతులా మారినట్లు చెప్పారు. ప్రకృతి వ్యవసాయం గో ఆధారిత వ్యవసాయం వంటి విషయాలు తెలియజేసేందుకు భూమి భారతిని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్‌గా భావించాలన్నారు. అంతేకాదు రసాయనక ఎరువుల వల్ల ఆహార పదార్థాల్లో కాలుష్యం పెరిగిపోయిందని.. అందువల్ల గో ఆదారిత ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల రాబోయే తరాల వారికి కలుషితం లేని ఆహార పదార్థాలను అందించగలమన్నారు.


రాజ్యాంగంలో ఇండియాతో పాటు భారత్ అనే పేరు కూడా ఉందని గుర్తు చేశారు జేడీ లక్ష్మీనారాయణ. ఇండియా అనే పేరు బ్రిటిష్ వాళ్లు ఇచ్చిన పేరని.. విదేశీయులు తెచ్చిన పేరును తీసేసి, మనం మన పేరు పెట్టుకుందామనే ఆలోచన కావొచ్చన్నారు. ఇండియా పేరును భారత్‌గా మార్చడం తప్పేమీ కాదని అభిప్రాయపడ్డారు. ఇండియా నుంచి భారత్‌గా పేరు మార్చాలంటే రాజ్యాంగ సవరణ కూడా చేయాలన్నారు. అయినా ఈ పేరు మార్పు వల్ల అసలు సమస్యలు పక్కదారి పట్టకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.


గతంలో దేశంలోని చాలా ప్రాంతాల పేర్లు మార్చారని గుర్తు చేశారు. మద్రాస్‌ను చెన్నైగా, బొంబాయిని ముంబైగా, కలకత్తాను కోల్‌కతాగా ఇలా పలు నగరాల పేర్లు మార్చిన విషయాన్ని ప్రస్తావించారు. అలాగే దేశం పేరు కూడా మారుస్తున్నారేమో అన్నారు. ఇండియా స్థానంలో భారత్ పేరు మార్చితే అప్పుడు ఆర్బీఐ, ఎయిమ్స్, ఐఐటీ, ఐపీఎస్, ఐఏఎస్ పేర్లు కూడా మార్చాల్సి ఉంటుందన్నారు. వీటిలో ఇండియా అనే పేరు ఉందని గుర్తు చేశారు. అయినా పేరు మార్పుపై చర్చలు జరుగుతున్నాయని.. పేరు ఏది మారినా దేశంలోని సమస్యలను దూరం చేయడం అసలు లక్ష్యం కావాలన్నారు లక్ష్మీనారాయణ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa