ప్రకాశం జిల్లా ఒంగోలులో కలకలంరేపిన బ్యూటీ పార్లర్లో దోపిడీ, హత్యాయత్నం కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో నలుగురు మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంగోలుకి చెందిన షేక్ రజియా శ్రీకృష్ణ నగర్లో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నారు. ఆమె భర్త షేక్ మీరా ఉద్యోగ నిమిత్తం ఉదయం వెళ్లి రాత్రి ఇంటికి వస్తారు. కూతురు కాలేజికి వెళ్లి సాయంత్రం వస్తుంది. దీంతో రజియా ఒంటరిగా ఇంట్లో ఉంటున్నారు.. అయితే రజియాకు షేక్ సాహెర భాను అనే స్నేహితురాలు ఉంది. ఆమెకు రజియా వద్ద రూ.10 లక్షలకు పైగా విలువైన బంగారు నగలు ఉన్నాయని తెలిసింది.
భాను బంగారం విషయాన్ని తనకు పరిచయమున్న కరణం దీప్తి, ముండ్రు లక్ష్మి నవత అలియాస్ నవ్య, అలహరి అపర్ణలకు చెప్పింది. దీంతో అప్పటికే చోరీలు చేసి ఉన్న ఈ గ్యాంగ్ రజియాపై కన్నేశారు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం.. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో బ్యూటీపార్లర్కు వెళ్లారు. మేకప్ చేయించుకునేందుకు వచ్చినట్లు రజియాను నమ్మించారు. మొదట ఇద్దరు ఐ బ్రోస్ చేయించుకోగా.. మరొకరికి పెడిక్యూర్ చేస్తుండగా సరైన సమయం చూసి ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం రజియా మీద ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న ద్రావణాన్ని ఆమెపై చల్లారు.
రజియాపై క్లోరోఫాం ప్రయోగించడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత వాళ్లు బంగారం, డబ్బుల్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలిని స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. పట్టపగలే దొంగతనం జరగడంతో పోలీసులు సీరియస్గా తీసుకున్నారు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి.. వెంటనే సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు. సీసీ కెమెరాల్లో ముగ్గురు నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కరణం మోహన దీప్తితో పాటుగా లక్ష్మి నవత, అలహరి అపర్ణ, దాసరి భాను ఉరఫ్ షేక్ సాహెరా భానులను అరెస్ట్ చేశారు చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
ఈ గ్యాంగ్ ఒంగోలు తాలూకా పరిధిలో పెళ్లూరు, పొదిలి, దొనకొండలలో కూడా చోరీలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. ముండ్రు నవ్య, కరణం దీప్తి, మరో ఇద్దరు యువకులతో కలిసి పెళ్లూరులోని ఒక అపార్టుమెంటులో వృద్ధురాలిని నిర్భంధించి బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్న కేసులో నిందితులని ఎస్పీ తెలిపారు. 24 గంటల్లోపే కేసును ఛేదించడమే కాకుండా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa