ఇటీవల హెచ్ఎండీఏ వేలంలో కోకాపేటలో ఎకరం భూమి రూ.100 కోట్లకుపైగా పలికిన సంగతి తెలిసిందే. బాబోయ్ ఎకరం భూమి విలువ వంద కోట్లా? అని చాలా మంది ఆశ్చర్యపోయారు. ఈ వేలంతో హైదరాబాద్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసొచ్చింది. దేశంలోకెల్లా అత్యంత ఖరీదైన ఐటీ కారిడార్గా కోకాపేట చరిత్ర సృష్టించింది. మరి ఎకరం భూమి ఏకంగా రూ.277 కోట్లపైగా పలికితే.. గజం భూమి విలువ దాదాపు రూ.6 లక్షలు పలికితే..? వామ్మో అనుకుంటున్నారా..? భారత ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై నగరంలో ప్రపంచంలోకెల్లా ఖరీదైన నగరాల్లో ఒకటనే సంగతి తెలిసిందే. ముంబై నగరంలో భూముల విలువ దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే చాలా ఎక్కువ. ఎంత అంటే.. ముంబై నగరంలోని బాంబే డైయింగ్ మిల్లుకు చెందిన 15 ఎకరాల భూమిని జపాన్కు చెందిన సమిటోమో అనే సంస్థ దాదాపు రూ.5 వేల కోట్లకు కొనుగోలు చేయనుందట. అంటే ఎకరం భూమి విలువ రూ.277 కోట్లకు పైమాటే. వొర్లీలోని బుధ్కర్ మార్గ్లో ఈ భూమి ఉంది.
వొర్లీలోని లక్ష చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమికి సంబంధించి లీగల్ వివాదాలు లేవని నిర్ధారించుకోవడం కోసం వాడియా చాందీ అనే లా ఫర్మ్ తన క్లయింట్ తరఫున ఈ వారం ఆరంభంలో పబ్లిక్ నోటీసు జారీ చేసింది. ఈ ప్రాపర్టీని అమ్మనున్న నేపథ్యంలో వాడియా గ్రూప్ హెడ్క్వార్టర్స్ అయిన వాడియా ఇంటర్నేషనల్ సెంటర్ భవంతిని ఖాళీ చేస్తున్నారు. చైర్మన్ ఆఫీసును దాదర్-నైగౌన్లోని బాంబే డైయింగ్ ప్రాపర్టీకి షిఫ్ట్ చేస్తున్నారు. వాడియా హెడ్ క్వార్టర్స్తోపాటు నటి శిల్పాశెట్టికి చెందిన బాస్టియన్ రెస్టారెంట్ సైతం మూతపడింది. దీంతో నుస్లీ వాడియా నియంత్రణలో ఉన్న హాట్ ప్రాపర్టీ విషయం రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొన్నేళ్ల క్రితం బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్.. పొవాయ్లోని హిరానందానీ గ్రూప్కు చెందిన ఆఫీసులు, రిటైల్ స్పేస్ను రూ.6700 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పట్లో బ్రూక్ఫీల్డ్ కొనుగోలు చేసింది భవనాలు. ఇప్పుడు వాడియా విక్రయిస్తోంది మాత్రం ఖాళీ భూములు మాత్రమే.
ఇప్పుడు జపాన్ కంపెనీకి విక్రయించనున్నారని ప్రచారం జరుగుతున్న ఈ 18 ఎకరాల స్థలం ముంబై నడి బొడ్డున ఉంటుంది. దీంతో ఇక్కడ లగ్జరీ అపార్ట్మెంట్లు, ఆఫీసులు, ఓ లగ్జరీ హోటల్, మాల్, ఓ హాస్పిటల్ను నిర్మించాలని గతంలో అనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. మిల్ ల్యాండ్ పాలసీ ప్రకారం బాంబే డైయింగ్ సంస్థ రీక్రియేషన్ (వసతుల కల్పన) కోసం బాంబే మున్సిపల్ కార్పొరేషన్కు 8 ఎకరాలు అప్పగించింది. మరో 8 ఎకరాలను రాష్ట్ర హౌసింగ్ అథారిటీకి ఇచ్చేసింది. ముంబైలో పెద్ద మొత్తంలో భూములున్న ప్రయివేట్ వ్యక్తుల్లో ఒకరిగా వాడియా గ్రూప్ ఛైర్మన్ అయిన నుస్లీ వాడియాకు పేరుంది. ఎఫ్ఈ దిన్షా ఛారిటీస్, ఎఫ్ఈ దిన్షా ట్రస్ట్కు ఆయన ఒక్కరే అడ్మినిస్ట్రేటర్. దిన్షా ట్రస్ట్కు 1500 ఎకరాల భూములున్నాయి. ఇవి ఎక్కువగా ముంబై శివార్లలోని మలాడ్, బోరివ్లీ ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే చాలా వరకు భూములు ఆక్రమణకు గురయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa