టీటీడీ ఆలయాల తెలంగాణ లోకల్ ఎడ్వైజరీ కమిటీ (ఎల్ఏసీ) ఛైర్మన్గా వై రవిప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు తిరుపతిలోని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి నివాసంలో గురువారం ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ను వై రవిప్రసాద్ సత్కరించారు. అంతేకాదు టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడిగా ఏజే శేఖర్రెడ్డిని నిమయించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి అందజేశారు. ఉత్తర భారతదేశంలోని టీటీడీ దేవాలయాలు, ఆస్తుల అడ్వయిజరీ కమిటీ అధ్యక్షురాలిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని నియమించారు. న్యూఢిల్లీ, రుషికేశ్, కరుక్షేత్ర, వారణాశిలలోని దేవాలయాలు, ఆస్తులకు సంబంధించిన సహాయ, సలహాలు తదితరాలను టీటీడీకి ప్రశాంతి అందిస్తారు.
మరోవైపు తెలంగాణ నుంచి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి సీతకు టీటీడీ పాలకమండలిలో స్థానం లభించింది. ఆమె ఇప్పటికే పాలకమండలి సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యంగా తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారుసు లేఖలను ప్రతి రోజూ స్వీకరించేలా చర్యలు చేపట్టాలని మొదటి పాలకమండలి సమావేశంలో కోరారు. వచ్చే పాలకమండలి సమావేశం కంటే ముందే సిఫారుసు లేఖల అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఈవో చెప్పినట్లు సీతా రంజిత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కచ్చితంగా టీటీడీ నిర్ణయం సానుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గోవు హిందువులకు తల్లి లాంటిదని.. భగవంతునితో సమానంగా పూజలు చేస్తారన్నారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అలాంటి గోవును సంరక్షించుకోవాల్సిన బాధ్యత భారతీయులందరిపైనా ఉందన్నారు. గోకులాష్టమి సందర్భంగా టీటీడీ ఎస్వీ గోసంరక్షణశాలలో గోకులాష్టమి-గోపూజ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అలాగే అలిపిరి వద్ద గల సప్తగోప్రదక్షిణ మందిరంలో శ్రీ వేణుగోపాల స్వామివారికి విశేషంగా అభిషేకం చేశారు. గోశాలలో సాహివాల్ గోసంతతి అభివృద్ధి కోసం చేపడుతున్న చర్యలను గుర్తించి రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం రూ.40 కోట్ల గ్రాంట్ అందించిందని వెల్లడించారు. టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర గోశాలలో గోకులాష్టమి సందర్భంగా గోపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. టీటీడీ కొన్ని సంవత్సరాలుగా గోసంరక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోందని చెప్పారు. గోమాత విశిష్టతను తెలిపేలా అవసరమైన రైతులకు గోవులను దానంగా ఇస్తున్నట్టు చెప్పారు. పూర్వపు రోజుల్లో ప్రతి రైతు ఇంట్లో గోవులు ఉండేవని, గతంలో ఒట్టిపోయిన గోవులను రైతులు గోశాలకు ఇస్తే, వాటిని సంరక్షించేవారని వివరించారు. గతంలో తాను ఛైర్మన్ గా ఉన్నప్పుడు వందే గోమాతరం పేరుతో అంతర్జాతీయ సదస్సు నిర్వహించామని, ఇద్దరు నోబెల్ గ్రహీతలు కూడా ఇందులో పాల్గొని గో ఉత్పత్తులు మానవాళికి ఏ విధంగా ఉపయోగపడతాయనే విషయంపై చర్చించారని చెప్పారు. ఇలాంటి సదస్సులు మరిన్ని నిర్వహిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa