ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్షనాయకుడు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ విషయంపై ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కోలా స్పందిస్తుండగా.. నేతలు కూడా వ్యక్తిగతంగా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓ ప్రతిపక్ష నాయకున్ని ఇలా అరెస్ట్ చేశారంటే.. బలమైన సాక్ష్యాలు, ఆధారాలు ఉంటేనే ఇలా చేస్తారని రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు. తనకు ఆ కేసు గురించి పూర్తి అవగాహన లేదని.. కానీ.. ఇలాంటి సమయంలో అరెస్ట్ చేసి ప్రతిపక్ష పార్టీకి సింపథీ క్రియేట్ చేయాలని ఏ పాలకపక్షం అనుకోదని చెప్పుకొచ్చారు. గతంలోనూ.. ప్రజాస్వామ్యంలో దేశంలో చాలా మంది సీఎంలు, మాజీ సీఎంలు, ప్రధాన మంత్రి కుటుంబసభ్యులు అరెస్టయిన దాఖలాలున్నాయని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కీంలో అవకతవకలకు పాల్పడ్డారని.. సుమారు 550 కోట్లు పక్కదారి పట్టాయంటూ వచ్చిన ఆరోపణలపై సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్టు చేశారు. వేకువజామున ఆరు గంటలకు నాటకీయ పరిణామాల మధ్య బాబును అరెస్ట్ చేసి.. విజయవాడలోని ఆఫీసుకు తీసుకొచ్చి.. గంటల తరబడి ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ పై అటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, ఇటు తెలంగాణలోని హైదరాబాద్లో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్ల మీదికొచ్చి ఆందోళనలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబు అరెస్టును పలువురు నాయకులు ఖండిస్తూ వస్తున్నారు. తెలంగాణకు చెందిన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు సైతం అరెస్టుకు ఖండించారు.
కాగా.. ఇప్పటికే చంద్రబాబు కుటుంబ సభ్యులంతా సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. నారా లోకేష్, భువనేశ్వరితో పాటు నందమూరి కుటుంబం కూడా కార్యాలయానికి చేరుకున్నారు. ఇక.. టీడీపీ మిత్రపక్షమైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. విజయవాడకు చేరుకునేందుకు అన్ని అడ్డంకులు దాటాల్సి వస్తోంది. ఆయన విజయవాడకు వస్తే.. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని భావిస్తోన్న పోలీసులు ఆయనను ఆపేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa