స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. గతరాత్రి సుదీర్ఘంగా ఆయన్ను విచారించిన అధికారులు.. రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. 2021లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదు. కాగా, కొద్దిసేపటి క్రితమే ఎఫ్ఐఆర్లో ఆయన పేరను చేర్చి రిమాండ్ రిపోర్టును సమర్పించారు. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులతో కలిసి చంద్రబాబే కుట్రకు సుత్రధారిగా వ్యవహరించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.టీడీపీ నేత ఇల్లందుల రమేష్ ద్వారా సీమెన్స్ కంపెనీ ప్రతినిధులు చంద్రబాబును కలిసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం కోర్టులో వాదనలు ప్రారంభం కాగా.. సీఐడీ తరఫున ఏఏజీ సుధాకర్రెడ్డి, చంద్రబాబు తరపున లాయర్ సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. ఇరుపక్షాల మధ్య వాడీవేడీగా వాదనలు కొసాగుతున్నాయి.
ఓపెన్ కోర్టులోనే వాదనలు జరగుతున్నాయి. మొదట తన ఛాంబర్లో వాదనలు వినిపించాలని న్యాయమూర్తి కోరగా.. ఓపెన్ కోర్ట్ లోనే వాదనలు వినాలని న్యామూర్తికి టీడీపీ లీగల్ టీం విజ్ఙప్తి చేసింది. దీంతో కోర్టు హాల్లోనే వాదనలు మెుదలయ్యాయి. గంట నుంచి గంటన్నర వరకు వాదనలు కొనసాగే అవకాశం ఉంది. అయితే చంద్రబాబుకు బెయిల్ లభిస్తుందా? లేక రిమాండ్కు తరలిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి చంద్రబాబు అని ఏపీ సీఐడీ ఆయన్ను అరెస్టు చేసింది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్కు ఒప్పందం కుదుర్చుకుని, ఎలాంటి ప్రాజెక్ట్ చేపట్టకుండానే నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేయించి.. అందులో రూ.241 కోట్లు కొల్లగొట్టారని అభియోగాలు మోపారు. ఈ మేరకు శనివారం నంద్యాలలో ఆయన్ను అరెస్టు చేసి భారీ భద్రత మధ్య విజయవాడకు తరలించారు.
చంద్రబాబును ఆదివారం తెల్లవారుజాము వరకు సిట్ కార్యాలయంలోనే ఉంచిన సీఐడీ అధికారులు.. 4 గంటల సమయంలో విజయవాడ జీజీహెచ్కు తరలించారు. బీపీ, మధుమేహం, ఎక్స్రే, ఛాతీ సంబంధిత పరీక్షలు నిర్వహించారు. శనివారం సాయంత్రం 5 గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు.. ఆదివారం తెల్లవారుజామున 3.00 గంటల వరకూ సుమారు 10 గంటలపాటు సిట్ కార్యాలయంలోనే ఉన్నారు. జీజీహెచ్ నుంచి మళ్లీ సిట్ కార్యాలయానికి తరలించిన అధికారులు ఆ తర్వాత ఆయన్ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం వాదనలు జరుగుతుండగా.. న్యాయమూర్తి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa