ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బయటకొచ్చిన రిమాండ్ రిపోర్టు,,,,చంద్రబాబును ఏ37గా పేర్కొన్న సీఐడీ రిపోర్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 10, 2023, 07:20 PM

స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో చంద్రబాబును ముఖ్య కుట్రదారుగా పేర్కొన్న ఏసీబీ. ఎఫ్ఐఆర్‌లో ఏ37గా పేర్కొంటూ కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించింది. కొద్దిసేపటి కిందటే ఆయన పేరును ఎఫ్ఐ‌ఆర్‌లో చేర్చింది. రిమాండ్ రిపోర్టుకు సంబంధించిన కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సీమెన్స్ కంపెనీకి ప్రభుత్వ వాటాగా రూ.371 కోట్లు చెల్లించారని, అందులోని 270 కోట్లను షెల్ కంపెనీలకు మళ్లించారని అందులో పేర్కొన్నారు. నిందితుడు ఇల్లందు రమేశ్ ద్వారా డిజైన్ టెక్, సీమెన్స్ ప్రతినిధులను చంద్రబాబు కలిశారని, క్యాబినెట్ తీర్మానాన్ని పక్కబెట్టి గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ వంటి అధికారులతో కుట్రపన్నారని ఆరోపించారు.


రిపోర్టులో నారా లోకేశ్ పేరు ప్రస్తావించిన సీఐడీ.. చంద్రబాబు సన్నిహితుడు కిలారు రాజేశ్ ద్వారా లోకేశ్‌కు డబ్బులు అందినట్టు రిపోర్టులో పేర్కొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి మార్కెట్ సర్వే జరగలేదని, 90 శాతం ఖర్చును సీమెన్స్ భరిస్తుందని క్యాబినెట్‌కు అబద్దాలు చెప్పారని వివరించారు. అంతేకాదు, అప్పటి ఆర్దిక శాఖ కార్యదర్శి కే సునీత అభ్యంతరాలను పట్టించుకోలేదని, పలు షెల్ కంపెనీల ద్వారా డిజైన్ టెక్‌కు రూ.270 కోట్లు మళ్లించారని తెలిపారు. మానిటరింగ్ కమిటీ ఏర్పాటుచేయకపోవడానికి చంద్రబాబు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడి కుట్రే కారణమని స్పష్టం చేశారు.


ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ పేరుతో కొత్త శాఖ ఏర్పాటు చేశారు. సీమెన్స్ ఎలాంటి ప్రాజెక్టు రిపోర్టు సమర్పించకపోయినా డీపీఆర్ ఆధారంగా రూ.3,281 కోట్ల బడ్జెట్‌ను క్యాబినెట్ ముందు పెట్టారు. ఎలాంటి బ్యాంకు గ్యారంటీలు లేకుండానే రూ.371 కోట్ల ప్రభుత్వం డిజైన్ టెక్‌కు విడుదల చేసిందని, కుట్రపై జీఎస్టీ విచారణ మొదలు కాగానే.. నిందితులు నోట్ ఫైల్స్ మాయం చేశారని ఆరోపించారు.


ప్రజా ప్రతినిధిగా విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని సీఐడీ ఆరోపించింది. చట్టాన్ని పట్టించుకోకుండా.. ప్రజాధనాన్ని రక్షించాల్సిన వారే మోసాలకు పాల్పడి.. ప్రభుత్వానికి తీవ్ర నష్టం చేకూర్చారని నివేదికలో పేర్కొంది. మోసాలకు పాల్పడేందుకు ఫోర్డరీ కూడా చేశారని, తప్పుడు డాక్యుమెంట్లను నిజమైన వాటిగా చూపించారని తెలిపింది. నేరానికి ప్రేరేపించి, తన అధికార హోదాను దుర్వినియోగం చేశారని రిపోర్టులో ఆరోపణలు చేసింది.


ఒప్పందంలో పేర్కొన్నట్టుగా ఈ కంపెనీల నుంచి ఎలాంటి సేవలు కాని, కార్యక్రమాలు కాని అందలేదని వివరించింది.


ఈ షెల్‌ కంపెనీల నుంచి మరికొన్ని చిన్నా చితకా కంపెనీల ద్వారా రూ.279 కోట్లను వివిధ మార్గాల ద్వారా మళ్లించారని రిపోర్టులో తెలిపింది. మా విచారణలో చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీచేసిన విషయం బయటపడిందని, ఆగస్టు 4, 2023న హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారి దొండపాటి వెంకట హరీష్‌ చంద్రబాబుకు నోటీసు జారీచేశారని సీఐడీ తెలిపింది.


ఐటీ నోటీసుల గురించి తెలియగానే మరో కీలక ముద్దాయి మనోజ్‌ వాసుదేవ్‌, చంద్రబాబు అప్పటి పీఏ పెండ్యాల శ్రీనివాస్‌ దేశం విడిచి పారిపోయారని పేర్కొంది. ముంబయి నుంచి ఎమిరేట్స్‌కు మనోజ్‌ సెప్టెంబరు 5 రాత్రి 7:10 గంటలకు పారిపోయాడని, సెప్టెంబరు 6న పెండ్యూల శ్రీనివాస్‌ అమెరికాకు పారిపోయాడని తెలిపింది. ‘పుణేలో 2017-18 మధ్య జీఎస్టీ అధికారులు చేసిన సోదాల్లో నిధుల దుర్వినియోగం బయటపడింది.. అక్కడ జరిపిన సోదాల్లో రూ.241 కోట్లు దుర్వినియోగం అయినట్టు నిర్దారించారు.. తప్పుడు ఇన్వాయిస్‌లు ఇచ్చి భారీ ఎత్తున ప్రజాధనాన్ని మళ్లించినట్టు కనిపెట్టారు.. ఎలాంటి హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, ఇతర పరికరాలు, సేవలు అందించలేదని నిగ్గు తేల్చారు..డబ్బును బ్యాంకుల ఖాతాలనుంచి డ్రా చేసి హవాలా మార్గాల ద్వారా మళ్లించారు’ అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa