శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం కేరళకు చెందిన ఓ చర్చి ఫాదర్ మండల దీక్ష చేపట్టి.. క్రైస్తవ సేవకుడిగా తన లైసెన్స్ను వదులుకున్నారు. ఆంగ్లికన్ చర్చి ఆఫ్ ఇండియాకు చెందిన రెవరెండ్ కేజీ మనోజ్ అనే ఫాదర్ శబరిమలకు వెళ్లేందుకు 41 రోజుల దీక్ష తీసుకున్నారు. ఇతర భక్తులతో కలిసి ఆయన మండల దీక్షను కొనసాగిస్తున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు రేగడంతో ఆయన చర్చి సేవల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ‘‘నా మండల దీక్ష గురించి తెలిసి చర్చి వర్గాలు అటువంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని.. క్రైస్తవ మత సిద్ధాంతాలు, నియమాలకు ఇది విరుద్దమని వివరణ కోరాయి.. వారికి వివరణ ఇవ్వడం కంటే వారిచ్చిన ఐడీ కార్డు, లైసెన్సు తిరిగి ఇచ్చేశాను’’ అని ఫాదర్ చెప్పారు.
‘తాను చేసింది ఆంగ్లికన్ చర్చ్ ఆఫ్ ఇండియా నియమాలు, సిద్ధాంతాలకు విరుద్ధం.. అయితే నేను మత సిద్ధాంతాల కంటే ‘దేవుడు’ అనే భావనకే అధిక ప్రాధాన్యం ఇస్తాను.. మతాచారాలకు అతీతమైన హిందూయిజంపై అవగాహన పెంచుకోవడమే నా ఉద్దేశం. చర్చిలో చేరిందీ ఈ ఆలోచనతోనే’ అని మనోజ్ తెలిపారు. ‘కుల, మత, విశ్వాసాలకు అతీతంగా అందరినీ ప్రేమించాలని దేవుడు చెబుతాడు... ఇతరులను ప్రేమించడం అనేది వారు చేసే పనులను బట్టి ఉంటుంది. కాబట్టి చర్చి సిద్ధాంతాన్ని అనుసరించాలనుకుంటున్నారా? లేదా దేవుని సిద్ధాంతాన్ని అనుసరించాలనుకుంటున్నారా? అనేది మీరు నిర్ణయించుకోవచ్చు... అలాగే, మీరు దేవుణ్ణి ప్రేమిస్తారా లేదా చర్చిని ప్రేమిస్తారా అనేది నిర్ణయించుకోవచ్చు’ అని మనోజ్ అన్నారు.
41 రోజుల మండల దీక్ష తీసుకోవాలనే తన నిర్ణయాన్ని విమర్శించిన వారికి ఫేస్బుక్లో ఓ వీడియోతో స్పష్టమైన వివరణ ఇచ్చారు మనోజ్. తన దృష్టిలో‘చర్చి’ అంటే సాంప్రదాయం.. మనకు మనం నిర్ణయించుకున్న ఆచారం అని చెప్పారు. చర్చి ఫాదర్గా బాధ్యతలు తీసుకోకముందు మనోజ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేసేవారు. తన ఆధ్యాత్మిక బోధనలకు ప్రామాణికతను కల్పించేందుకే తాను ఫాదర్గా బాధ్యతలు చేపట్టానని చెప్పారు. ‘ వారికంటూ నియమాలు, నిబంధనలు ఉన్నాయి. నా చర్యలను అంగీకరించలేరు.. అందుకే నన్ను ప్రశ్నించారు.. శబరిమలను దర్శించుకోవాలనే నా కలను నెరవేర్చుకోవడానికి.. హిందూ ఆచార వ్యవహారాలను నిర్వహించడానికి చర్చి ఇచ్చిన లైసెన్స్ను తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను’ అని మనోజ్ వివరించారు. ‘వివరణ కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నాను.. నా శబరిమల దర్శనం వల్ల వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనుకుంటున్నాను.. వారి స్థితిని నేను అర్థం చేసుకోగలను’ అని స్పష్టం చేశారు. ఒకవేళ చర్చి అథారిటీ తిరిగి లైసెన్స్ ఇస్తే ఫాదర్గా కొనసాగుతాననని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa