ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హౌస్ అరెస్ట్ పిటిషన్ వేసిన చంద్రబాబు నాయుడు,,,సెంట్రల్ జైల్లో భద్రతకు ఢోకా లేదని ఏఏజీ వాదనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 12, 2023, 06:37 PM

స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మరోసారి ఏసీబీ కోర్టులో చుక్కెదురయ్యింది. ఆయన హౌస్‌ కస్టడీ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. సీఐడీ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. చంద్రబాబు హౌస్‌ కస్టడీపై ఏసీబీ కోర్టులో సోమవారం ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు ముగియగా.. తీర్పును రిజర్వులో ఉంచారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు తీర్పును వెలువరించిన న్యాయమూర్తి.. హౌస్ అరెస్ట్ పిటిషన్ కొట్టివేశారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని, జైల్లో పూర్తి స్థాయి భద్రత కల్పించామని అదనపు ఏజీ న్యాయస్థానానికి తెలియజేశారు. జైల్లోనే కాకుండా పరిసర ప్రాంతాల్లోనూ పోలీసు భద్రత ఉన్నట్లు ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.


24 గంటలూ పోలీసులు విధుల్లోనే ఉంటున్నారని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే వైద్య సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశామని ఏఏజీ వివరించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో హైసెక్యూరిటీ ఉందని, ఇంటి నుంచి ఆహారానికి కోర్టు అనుమతించిందని తెలియజేశారు. ఓ బ్లాక్‌ను పూర్తిగా చంద్రబాబు కోసం కేటాయించారని, ఆయన అనుమతి లేనిదే ఎవరూ లోపలికి ప్రవేశించలేరన్నారు. ఇంటి కంటే జైలులోనే భద్రత ఉంటుందని ఏఏజీ కోర్టుకు వివరించారు. చంద్రబాబు భద్రత కోసం తీసుకున్న చర్యలపై హోం శాఖ ముఖ్య కార్యదర్సి, జైళ్ల శాఖ డీజీ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న హరీష్ కుమార్ గుప్తా రాసిన లేఖను అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏసీబీ స్పెషల్ కోర్టు ముందు ఉంచారు. ఈ సందర్భంలో లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. చంద్రబాబుకి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ప్రత్యేక భద్రత ఉందన్నారు. వార్డులో ప్రత్యేక గది కేటాయించామని.. ఆ ప్రాంతంలో శానిటైజ్ చేసి జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ప్రత్యేక వార్డు వద్ద భద్రత కోసం ఆర్మ్‌డ్ గార్డుల ఏర్పాటు చేసి..ఎవరికీ అనుమతి లేదన్నారు. చంద్రబాబు గది ప్రత్యేకంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉందన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండిండెంట్ 24/7 పర్యవేక్షిస్తున్నారన్నారు.


అటు, చంద్రబాబు నాయుడు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ఆయనకు జైలులో ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. కరుడుగట్టిన నేరస్థులు, మావోయిస్టులు అదే జైల్లో ఉన్నారని, ఆయనకు ముప్పు ఉన్న నేపథ్యంలోనే ఎన్‌ఎస్‌జీ భద్రత కల్పించారని లూథ్రా కోర్టుకు వివరించారు. కేంద్రం కల్పించిన సెక్యూరిటీకి సంబంధించిన అంశంపై ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు అవకాశం లేదని కోర్టుకు విన్నవించారు. ఈ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa