ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేఘా ఇంజినీరింగ్ సంస్థలో సలహాదారు పదవికి పీవీ రమేశ్ రాజీనామా,,,దేవుడు చెప్పినా తప్పు చేయనని ట్వీట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 12, 2023, 06:56 PM

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో తన వాంగ్మూలం ఆధారంగానే.. చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు చేశారనే ప్రచారాన్ని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ ఖండించిన సంగతి తెలిసిందే. గతంలో ఏపీ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేసిన రమేశ్‌.. ఈ కేసుపై గతంలోనే సీఐడీకి రాతపూర్వకంగా సమాధానాలు ఇచ్చారు. తాజాగా మేఘా ఇంజినీరింగ్ సంస్థలో తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన.. ట్విట్టర్ వేదికగా తన వైఖరి ఏంటో కుండబద్దలు కొట్టారు. ‘నా జీవితం మొత్తం నిస్సందేహంగా ప్రజా ప్రయోజనాల కోసమే పని చేశాను. రాజకీయాలు, సామాజిక, ఆర్థిక, వ్యాపార ఒత్తిళ్లకు లొంగకుండా ప్రజల కోసమే పని చేశాను. ప్రజల కోసం పని చేయాలన్న నా మనస్సాక్షికి వ్యతిరేకంగా.. ప్రజా ప్రయోజనం లేని పని చేయాలని నన్నెవరూ బలవంతం చేయలేరు. ఆ భగవంతుడికైనా అది సాధ్యం కాదు’ అని రమేశ్ ట్వీట్ చేశారు.


ఏపీలోని రాజకీయ పరిణామాల నేపథ్యంలో పీవీ రమేశ్ చేసిన ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. కాగా ఆయన మేఘా ఇంజినీరింగ్ కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా చేయడానికి కారణం ఇదంటూ సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేశ్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ యథాతథంగా.. ‘‘మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్, మేఘా ఇంజనీరింగ్ కంపెనీ నుంచి తాజాగా రాజీనామా చేశారు. స్కిల్ డెవలప్మెంట్ విషయంలో దొంగ కేసు పెట్టి, మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయటం కరెక్టు కాదని పీవీ రమేష్ అన్న మాటలు సిఐడి కేసులో గాలిని తీసేశాయి. అందుకే హైదరాబాద్ లో దిగీదిగగానే జగన్ నుంచి రియాక్షన్ వచ్చింది. రిటైర్మెంట్ తర్వాత మేఘా కంపెనీలో సలహాదారుగా పీవీ రమేష్ ఉన్నారు. సీఎం కోరిక మేరకు ఆయన్ని రిజైన్ చేయాలని వాళ్లు అడిగారు. ఆయన వెంటనే, అంటే నిన్న, రిజైన్ చేశారు.


వాస్తవానికి ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉంది. ఈ మేరకి పత్రికలకి సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే జగన్ నుంచి మేఘాకి, మేఘా నుంచి ఆయనకి ఫోన్ వచ్చింది. ప్రెస్ మీట్ పెట్టొద్దని వాళ్లు చెప్పారు. ఆయన ఒప్పుకోలేదు. అలాగయితే తమదగ్గర కొనసాగడం కష్టం అని చెప్పారు. ఉద్యోగం నుంచి వైదొలగడానికి ఆయన సంసిద్ధులయ్యారు. ఈ మేరకు నిన్న సాయంత్రం ఆయన రాజీనామా లేఖని సమర్పించారు.


డబ్బు, రాజకీయ అధికారంతో పాటు రక్త చరిత్ర ఉంటే అన్ని వ్యవస్థల మీద తిరుగులేని ఆధిపత్యం సంపాదించవచ్చు. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ శ్రీనివాసరెడ్డి, కృష్ణారెడ్డిలది. వాళ్లు పట్టిసీమ పని చేసినప్పుడు, చంద్రబాబుతో కలిసి డబ్బులు తిన్నారని జగన్ ఆరోపించాడు. అధికారంలోకి వచ్చాక, బేరం మాట్లాడుకొని, పోలవరంతో సహా ఎన్నో కాంట్రాక్టులు ఇచ్చాడు. మేఘా ద్వారా టీవీ 9, ఎన్టీవీల్లో వాటాలు కొనిపించి, వాళ్ల మీద ఆధిపత్యం సంపాదించాడు. ఇప్పుడు జగన్ ఆదేశాల ప్రకారం, తమ సంస్థలో సలహాదారుగా ఉన్న పీవీ రమేష్ గార్ని రిజైన్ చేయించాడు’’ అని కందుల రమేశ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై పీవీ రమేశ్ స్పందించారు. తనను రాజీనామా చేయమని చెప్పారనడం సరికాదని ఆయన తెలిపారు. కందుల రమేశ్ తన ట్వీట్లో ప్రస్తావించిన మిగతా అంశాలపై మాత్రం ఆయన స్పందించలేదు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa