గ్రామ సచివాలయ సిబ్బంది కళ్లలో కారం కొట్టి, పింఛన్ సొమ్మును ఎత్తుకెళ్లిన కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇది ఇంటి దొంగ పనేనని పోలీసులు తేల్చారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో రెండు వారాల కిందట జరిగిన ఈ దారి దోపిడీ కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ఆగస్టు 31న మధ్యాహ్నం జానకయ్యపేట గ్రామానికి సంబంధించిన పింఛన్లు పంపిణీ చేసేందుకు సచివాలయ సిబ్బంది నక్కపల్లిలోని ఐవోబీ బ్యాంక్ నుంచి నగదు డ్రా చేసుకొని స్కూటీపై బయల్దేరారు. అయితే, హెటిరో డ్రగ్స్ కంపెనీ లైన్లోని రహదారిలో తమ వాహనాన్ని దుండగులు అడ్డగించి కళ్లల్లో కారం కొట్టి రూ. 14 లక్షల నగదును ఎత్తుకెళ్లిపోయారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అనకాపల్లి పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. చివరికి ఇంటి దొంగే ఈ దోపిడీకి సూత్రధారని తేల్చారు. సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ నానిబాబు తన ఇద్దరు స్నేహితులతో కలిసి దోపిడీకి కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బ్యాంక్ నుంచి సంఘటన జరిగిన ప్రాంతం వరకు 26 సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితులను గుర్తించారు.
బైక్ కలర్ ఆధారంగా నానిబాబు ఆట కట్టించారు పోలీసులు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఈ కేసులో నానిబాబుతో పాటు అతడి స్నేహితులు సాయికుమార్, చందక సాయిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 12 లక్షల 92 వేల రూపాయల నగదుతో పాటు రెండు బైకులు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారి నానిబాబేనని గుర్తించిన పోలీసులు.. కేసులో అతడిని ఏ1గా చేర్చారు. ఈ కేసు వివరాలను అనకాపల్లి జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ.. మీడియాకు వెల్లడించారు. కేసును చేధించడంలో చురుగ్గా వ్యవహరించిన పోలీసు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa