చంద్రయాన్ 3 ప్రయోగం విజయానికి సంబంధించి లోక్సభలో నిర్వహించిన చర్చ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై.. బీజేపీ ఎంపీ రమేష్ బిధురి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారి తీశాయి. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళానికి దారి తీసింది. బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్న ప్రతిపక్షాలు.. వెంటనే ఆయనపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాయి. ఈ ఘటనపై స్పందించిన కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్.. తమ పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యల పట్ల తాను విచారం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రతిపక్షాలు.. రమేష్ బిధురిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే లోక్సభ స్పీకర్ రమేష్ బిధురికి హెచ్చరికలు జారీ చేశారు.
లోక్సభలో శుక్రవారం చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్పై చర్చ చేపట్టారు. ఈ సంద్భంగా బీఎస్పీ నేత డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధురి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. డానిష్ అలీ ఒక ఉగ్రవాది అని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే వివాదానికి కారణం అయ్యాయి. అయితే రమేష్ బిధురి చేసిన వ్యాఖ్యలు తాను వినలేదని పేర్కొన్న కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్.. ఒకవేళ ఆ వ్యాఖ్యలు ప్రతిపక్ష సభ్యులకు ఇబ్బంది కలిగించేలా ఉంటే సభ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు.
విపక్షాల తీవ్ర నిరసనలతో బీజేపీ ఎంపీ రమేష్ బిధురి చేసిన వ్యాఖ్యలను సభా రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు బీజేపీ ఎంపీ రమేష్ బిధురి ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని సభలో రగడ జరగడంతో స్పీకర్ స్పందించారు. సహచర సభ్యుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై స్పీకర్ ఓం బిర్లా బీజేపీ సభ్యుడు రమేష్ బిధురిని హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేస్తే ఊరుకునేది లేదని పేర్కొన్నారు.
అయితే రమేష్ బిధురి చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేస్తే సరిపోదని.. అతడ్ని సస్పెండ్ లేదా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. తమ నేత అధిర్ రంజన్ చౌదరీ.. కేంద్రమంత్రులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సస్పెండ్ చేశారని.. ఇప్పుడు ఎందుకు చేయడం లేదంటూ ప్రశ్నించింది. రమేష్ బిధురిపై చర్యలు తీసుకోవాలని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. ఆయనపై ఏం చర్యలు చేపడతారో చెప్పాలని ట్విట్టర్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ముస్లింలు, ఓబీసీలను అవమానించడం బీజేపీ సంస్కృతిలో భాగమని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa