ఏపీలో ఎక్కడ విన్నా సరే స్కిల్ డెవలెప్మెంట్ కేసు, చంద్రబాబు అరెస్ట్పైనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చిన విజయవాడ స్పెషల్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందుపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఏకంగా రాష్ట్రపతికి ఫిర్యాదులు అందాయి. చంద్రబాబును రిమాండ్కు పంపారన్న ఆగ్రహంతో ఆమెను కించపరుస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు.
జడ్జిని కించపరుస్తూ సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదులపై రాష్ట్రపతి భవన్ స్పందించింది.. విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్ను రాష్ట్రపతి కార్యదర్శి పీ.సీ మీనా ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పోస్టులు పెట్టిన వారిపై తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుడికి వివరించాలని లేఖ రాశారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఐడీ ఈ నెల 9న నంద్యాలలో అరెస్ట్ చేశారు. ఈ నెల 10న ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల పాటూ న్యాయమూర్తి హిమబిందు రిమాండ్ విధించారు. ఆ వెంటనే ఆయన్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. శుక్రవారంతో రిమాండ్ ముగియగా.. మరో రెండు రోజులు పొడిగించారు. అలాగే చంద్రబాబును రెండు రోజులు సీఐడీ కస్టడీలో విచారణకు అనుమతించారు. శని, ఆదివారాల్లో సీఐడీ అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తారు. అంతేకాదు జడ్జి హిమబిందుకు ఏపీ ప్రభుత్వ భద్రతను కూడా కల్పించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa