పదేళ్ల బాలుడు సమయస్ఫూర్తి పెను ప్రమాదం నుంచి తప్పించడమే కాదు.. వందల మంది ప్రాణాలు కాపాడింది. పశ్చిమ్ బెంగాల్లోని మల్దా జిల్లాకు చెందిన ఐదో తరగతి చదువుతోన్న ఆ చిన్నారి చేసిన పని అందరి ప్రశంసలు అందుకుంటోంది. రైలు పట్టాల కింద పెద్ద గుంత ఏర్పడిన విషయం గమనించిన ఆ బాలుడు.. తన ఒంటిపై ఎరుపు టీషర్టు ఊపుతూ పట్టాల వెంట పరుగులు తీసి అటుగా వస్తోన్న రైలును ఆపేశాడు. దీంతో లోకో పైలట్ రైలును ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన మాల్దా జిల్లా హరిశ్చంద్రపుర్ రెండో బ్లాక్లోని మషాల్దాహ్ పంచాయతీ పరిధి కరియాలి గ్రామం వద్ద శుక్రవారం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన ముర్సెలీమ్ అనే పదేళ్ల బాలుడు శుక్రవారం మధ్యాహ్నం స్థానిక చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో చెరువుకి సమీపంలో రైలు పట్టాల కింద పెద్ద గుంత ఉండటం ముర్సెలీమ్ కంటబడింది. అంతలోనే అదే మార్గంలో అగర్తల-సియాల్దా కాంచన్జుంగా ఎక్స్ప్రెస్ రైలు వేగంగా వస్తోంది. దీంతో అప్రమత్తమైన ముర్సెలీమ్ వేగంగా పట్టాల వద్దకు పరుగెత్తాడు. తన ఒంటిపై ఉన్న ఎరుపు రంగు టీషర్టు తీసి రైలుకు ఎదురుగా గాల్లో ఊపుతూ నిలబడ్డాడు. దీనిని గమనించిన లోకోపైలట్ ప్రమాదం ఉందని గ్రహించి వెంటనే రైలును నిలిపివేశాడు.
కిందకు దిగిన లోకోపైలట్కు ముర్సెలీమ్ పట్టాల పరిస్థితి.. గుంత ఏర్పడిన విషయం వివరించాడు. దీంతో బాలుడి సమయస్ఫూర్తికి ఆయన ఆశ్చర్యపోయారు. చిన్నారిని అభినందించిన లోకోపైలట్.. ఇటీవల కురిసిన వర్షాలకు పట్టాల కింద మట్టి, కంకర కొట్టుకుపోయినట్లు గుర్తించారు. లోకోపైలట్ ఇచ్చిన సమాచారంతో రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గుంతను పూడ్చివేశారు. దీంతో గంట పాటు రైలును అక్కడ నిలిపివేయాల్సి వచ్చింది. పనులు పూర్తయిన తర్వాత రైలు యథావిథిగా బయలుదేరింది. ముర్సెలీమ్ పేరును అవార్డు కోసం సిఫార్సు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు.
‘తన కుమారుడు చాలా మంది ప్రాణాలను కాపాడాడు.. ఇది నాకు గర్వకారణం.. రైల్వే అధికారులు కూడా కృతజ్ఞతలు తెలిపారు’ అని బాలుడి తల్లి మోర్జినా అన్నారు. ఇక, ఈ ఘటనపై ఈశాన్య సరిహద్దు రైల్వే స్పందిస్తూ.. బాలుడికి రివార్డు ప్రకటించింది. ‘ఘటన మా దృష్టికి వచ్చింది.. మేము ఆ చిన్నారికి బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం... త్వరలోనే అతనికి పారితోషికం అందజేయనున్నాం’ అని ఈశాన్య సరిహద్దు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సవ్యసాచి దేవ్ అన్నారు. తూర్పు రైల్వే సీపీఆర్వో కౌశిక్ మిత్రా మాట్లాడుతూ.. ‘బహుశా నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో జరిగిన ఘటన విషయం మా దృష్టికి రాలేదు.. తూర్పు రైల్వే తరపున నేను పిల్లవాడిని అభినందిస్తున్నాను.. అయితే అతనికి పారితోషికం ఇచ్చే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa