నగల దుకాణం అంటేనే చాలా విలువైన సొత్తు ఉంటుంది. దానికి భద్రత కూడా అదే రేంజ్లో ఏర్పాటు చేస్తారు. దొంగలు అందులోకి ప్రవేశించకుండా, ఒకవేళ దొంగతనం జరిగినా నిందితులను పట్టుకునేలా పటిష్ఠ బందోబస్తు చర్యలన్నీ తీసుకుంటారు. అయినా చాకచక్యం ప్రదర్శించిన దొంగలు.. జ్యువెలరీ షాప్లో భారీ చోరీ చేశారు. ఏకంగా రూ.25 కోట్ల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లిపోయారు. దానికి భారీ ప్లాన్ కూడా వేశారు. సీసీటీవీ కెమెరాలు పనిచేయకుండా ముందుగానే వాటి కనెక్షన్లను తొలగించారు. ఇక అతి ముఖ్యమైన లాకర్ రూమ్కే కన్నం వేసి దొంగతనానికి పాల్పడ్డారు. అయితే రోజూ లాగే ఆదివారం దుకాణం మూసేసిన యజమాని సోమవారం దుకాణం మూసి వేయగా.. మంగళవారం ఉదయం వచ్చి చూసేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.
దక్షిణ ఢిల్లీ పరిధిలోని జంగ్పుర ప్రాంతంలో ఉన్న ఉమ్రావ్ జ్యువెలరీ షాపులో ఈ భారీ చోరీ జరిగింది. నాలుగో అంతస్థులో ఉన్న టెర్రస్పై నుంచి లోపలికి చొరబడిన దుండగులు.. డైరెక్ట్గా లాకర్ రూమ్కే భారీ కన్నం వేసి రూ.25 కోట్ల విలువ చేసే నగలు, ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయారు. అయితే ఆదివారం దుకాణం మూసేసిన యజమాని మంగళవారం తెరిచి చూసే సరికి దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. దొంగతనం చేయడానికి ముందు దొంగలు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించారని.. పక్కా పథకం వేసుకున్న తర్వాతే దాన్ని అమలు చేసి భారీ చోరీకి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఎంతో చాకచక్యంగా ముందుగా ఆ భవనంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పనిచేయకుండా చేశారని పోలీసుల విచారణలో తేలింది. మరోవైపు.. సోమవారం నగల షోరూమ్ మూసి ఉంటుందని తెలుసుకుని పకడ్బందీగా ప్లాన్ చేసి చోరీ చేసినట్లు గుర్తించారు. నాలుగో ఫ్లోర్లో టెర్రస్పై నుంచి లోపలికి చొరబడ్డారని.. వెంటనే సీసీటీవీల కనెక్షన్లను తొలగించి.. ఆ తర్వాత భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్కు చేరుకున్నట్లు తెలిపారు. అక్కడ ఉన్న స్ట్రాంగ్ రూమ్కు చేరుకొని లాకర్కు భారీ కన్నం చేసినట్లు పేర్కొన్నారు. అందులో ఉన్న సుమారు రూ.25 కోట్ల నగలను దోచుకెళ్లినట్లు గుర్తించారు. వాటితోపాటు డిస్ప్లేలలో ఉంచిన నగలను కూడా సర్దుకుని వెళ్లినట్లు చెప్పారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు.. సీసీటీవీ కనెక్షన్ తొలగించక ముందు రికార్డ్ అయిన ఫుటేజీని పరిశీలిస్తూ దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే సోమవారం హర్యానాలో కూడా ఇలాంటి చోరీ జరగడంతో ఈ రెండు ఘటనలకు ఏదైనా లింక్ ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హర్యానాలోని ఓ కో ఆపరేటివ్ బ్యాంక్లో దూరిన దుండగులు.. గ్యాస్ కట్టర్తో కన్నం వేసి.. అందులో ఉన్న డబ్బు, నగలను ఎత్తుకెళ్లారు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa