ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రసేన ఘన విజయం సాధిస్తుంది,,,,,వచ్చే ఎన్నికలపై దత్ జోస్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 27, 2023, 07:10 PM

ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్‌ ఏపీ రాజకీయాలపై తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి 160 సీట్లు సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భువనేశ్వరి, బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు లాంటి మహానాయకుడిని జైల్లో పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. మహా నాయకుడిని జైల్లో పెడతారని ఎవరైనా ఊహిస్తారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రసేన సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.


చంద్రబాబు అరెస్టుపై సినీ ప్రముఖులు స్పందించకపోవడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు కోసం తెలుగు సినిమా రంగం నుంచి తాము వచ్చామని, రాని వారి గురించి వదిలేయండని అన్నారు. సినీ రంగంలో తాము మాత్రమే ఉన్నామని అనుకోండని వ్యాఖ్యానించారు. భువనేశ్వరి ఎన్టీఆర్ బిడ్డ అని, బ్రాహ్మణి ఎన్టీఆర్ మనవరాలని, వారు ధైర్యంగానే ఉన్నారని తెలిపారు. చంద్రబాబు, జనసేనను ఉద్దేశించి 'చంద్రసేన'గా వ్యాఖ్యానించిన అశ్వనీదత్.. రాష్ట్ర ప్రజలు 2024లో గొప్ప చరిత్రను చూడబోతున్నారని పేర్కొన్నారు.


తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ జనసేన పార్టీ నాయకులతో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉండాలన్నారు. ఎలాంటి భేషాజాలకు పోవద్దని.. మూడు నెలలు కష్టపడి పని చేస్తే అన్ని మంచి రోజులే వస్తాయన్నారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు అవసరం ఉందని.. ఓటు ద్వారా నిర్ణయించాలన్నారు. చంద్రబాబు ఏం నేరం చేశారని జైల్లో పెట్టారని నటుడు మురళీమోహన్ ప్రశ్నించారు. చంద్రబాబును చూస్తే చాలా బాధగా ఉందని.. ఆయన గ్రహణం పోయి త్వరలోనే బయటకు వస్తారన్నారు. కనీస వసతులు లేకుండా చంద్రబాబును ఖైదీల మధ్య జైల్లో ఉంచారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa