అరేబియా సముద్రంలో ఉన్న వాయుగుండం శనివారం రాత్రి కొంకణ్, గోవాల మధ్య తీరం దాటి.. ఈశాన్యంగా పయనించే క్రమంలో ఆదివారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది మధ్యప్రదేశ్లో కొనసాగుతోంది. అలాగే వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం ఆదివారం పశ్చిమబెంగాల్, ఉత్తర ఒడిశా మధ్య తీరందాటి జార్ఖండ్లో కొనసాగుతుంది. రాష్ట్రంలో ఆదివారం మధ్యాహ్నం వరకుఎండ తీవ్రత, ఉక్కపోత వాతావరణం ఉంది. ఆదివారం నెల్లూరు జిల్లా కావలిలో 36.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారం మధ్యాహ్నం తరువాత పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ,తూర్పుగోదావరి, ఏలూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో 51 మిల్లీ మీటర్లు, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 34.2, విజయనగరం జిల్లి గంట్యాడలో 34.2, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో 33.4, తిరుపతి జిల్లా సత్యవేడులో 33, బాపట్ల జిల్లా కారంచేడులో 31.2, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 29.6, విజయనగరం జిల్లా మెంటాడలో 29.6, ప్రకాశం జిల్లా ముండ్లమూరులో 28.2, ప్రకాశం జిల్లా మర్రిపూడిలో 23.4, విజయనగరం జిల్లా బొందేపల్లిలో 23, గుంటూరు జిల్లా తెనాలిలో 22.8, విజయనగరం జిల్లా గజపతినగరంలో 21.6 మిల్లీ మీటర్ల వర్షపాంత నమోదైంది.
అల్పపీడనం ప్రభావంతో విశాఖలో ఆదివారం సాయంత్రం వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత కొనసాగినా.. మధ్యాహ్నం మూడు గంటల నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు ఆవరించడంతో అనేక ప్రాంతాల్లో చీకటి వాతావరణం కనిపించింది. అనంతరం అరగంటపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ, ఉక్కపోతతో జనాలు అల్లాడిపోయారు. అనంతరం వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో జనాలు కాస్త ఊరట చెందారు.చిత్తూరు జిల్లాలో కూడా 13 మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు వానలు పడ్డాయి. గతవారంలో నాలుగైదు రోజుల పాటూ వర్షాలు జోరుగా కురిశాయి.. కానీ ఆదివారం మాత్రం వాతావరణం పూర్తిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ.. ఆ తర్వాత వానలు పడ్డాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa