ఆర్టీసీ ఉద్యోగులకు 17వ పీఆర్సీ అరియర్స్ బకాయిలు రూ.550 కోట్ల మేర చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు పైసా కూడా చెల్లించలేదని, వెంటనే ఆర్టీసీ ఉద్యోగులకు బకాయిపడిన రూ.850 కోట్లను తక్షణం చెల్లించాలని ఏపీపీటీడీ ఎన్ఎంయూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ అరియర్స్ చెల్లిస్తామని ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హామీ కూడా ఇచ్చిన నేపథ్యంలో తక్షణం అరియర్స్కు విడుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీపీటీడీలో ఎన్ఎంయూ అసోసియేషన్కు గుర్తింపు రావటం పట్ల విజయవాడలోని ఎంబీ భవన్లో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒకవైపు హర్షం తెలుపుతూనే.. ప్రభుత్వం నుంచి పరిష్కారం కావాల్సిన అంశాలను ప్రస్తావించారు. ఎన్ఎంయూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ఆర్టీసీలో పనిచేస్తున్న పీటీడీ ఉద్యోగులకు అధిక పెన్షన్ స్కీమ్ వర్తింప చేయటానికి వీలుగా లీవ్ ఎన్క్యా్షమెంట్, పీఆర్సీ అరియర్స్ డబ్బులు విడుదల చేస్తే ఆ డబ్బులను అటు కట్టుకోవటానికి అవకాశం ఉంటుందన్నారు. దీనివల్ల ఆర్టీసీ ఉద్యోగులకు కొంత వరకు అధిక పెన్షన్ వస్తుందన్నారు. క్యాడర్ స్ర్టెంగ్త్ పేరుతో ఇటీవల కాలంలో అడ్డగోలుగా బదిలీలు నిర్వహించారని, ఈ బదిలీల కారణంగా పీటీడీ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు. ఎక్కడ పనిచేస్తున్న వారిని తిరిగి అక్కడే నియమించి హెచ్ఆర్ఏ వర్తింప చేయాలన్నారు. పీటీడీ ఉద్యోగులకు నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన అలవెన్సులను వేతనంతో పాటు కలిపి చెల్లించాలని డిమాండ్ చేశారు. అలవెన్సులకు సంబంధించి రూ.3 కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉందని, తక్షణం వాటిని వేతనాలతో కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం 1000 కొత్త బస్సులు కొనాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో ఖాళీలను తక్షణం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa