వర్షాకాలం ముగిసి చలికాలం వచ్చిందంటే చాలు దోమలు స్వైర విహారం చేస్తాయి. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లో గుడ్లు పెట్టి కుప్పలు కుప్పలుగా విస్తరిస్తాయి. ఇక అవి మనుషుల్ని కుట్టి అనేక వ్యాధులకు కారణం అవుతాయి. దీంతో అసలు దోమల్ని చూస్తేనే వణికిపోయే పరిస్థితి కనిపిస్తోంది. వైరల్ ఫీవర్, డెంగ్యూ, చికెన్ గున్యా సహా వివిధ రోగాలకు ఈ దోమలే కారణం. అయితే ఆ దోమలకు భయపడిన ఓ వ్యక్తి ఏకంగా వాటిని తీసుకుని ఆస్పత్రికి వెళ్లాడు. తనకు చికిత్స అందించాలని డాక్టర్లను కోరాడు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది.
పశ్చిమ బెంగాల్లో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళకోట్లోని కుర్తుబా గ్రామానికి చెందిన మన్సూర్ అలీ షేక్.. తనను కుట్టిన దోమలను సేకరించి ఆసుపత్రికి తీసుకొచ్చాడు. డెంగీ కేసులతో ఆందోళన చెందిన మన్సూర్.. భయంతో తనను కుట్టిన 25, 30 దోమలను చంపి వాటన్నింటిని ఓ పాలిథిన్ బ్యాగ్లో వేసి ఆసుపత్రికి తీసుకొచ్చాడు. దీంతో అవి చూసిన డాక్టర్, ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అసలు దోమల పేరు చెబితేనే వణికిపోతున్న సమయంలో అన్ని దోమలను కవర్లో వేసుకుని ఏకంగా ఆస్పత్రికి రావడంతో వారు నోరెళ్లబెట్టారు.
అయితే ఆ సమయంలో విధుల్లో ఉన్న డాక్టర్ జుల్ఫికర్ అలీ.. మన్సూర్ అలీ షేక్ను చూసి ఎమర్జెన్సీ కేసు అనుకున్నట్లు తెలిపారు. అయితే అతని చేతిలో ఉన్న కవర్లో దోమలను చూసి షాక్ అయినట్లు పేర్కొన్నారు. అయితే తాను ఎందుకు అలా దోమలను తీసుకువచ్చానో మన్సూర్ అలీ షేక్ వివరించాడు. తనకు ఒక దుకాణం ఉందని.. దాని పక్కనే గత కొంత కాలంగా నీళ్లు నిలిచిపోయాయని తెలిపాడు. అక్కడ దోమలు గుడ్లు పెట్టి విపరీతంగా ఉన్నాయని.. అయితే అందులోని కొన్ని దోమలు తనను కుట్టాయని.. అందుకే వాటిని పట్టుకుని ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు వివరించాడు. ఆ దోమలను డాక్టర్లు పరీక్షించి తనకు సరైన చికిత్స అందిస్తారని.. వాటిని కష్టపడి పట్టుకుని కవర్లో వేసుకుని వచ్చినట్లు పేర్కొన్నాడు.
ఇక తన దుకాణం ఉన్న ప్రాంతంలో మురికి కాలువను వెంటనే శుభ్రం చేసి.. దోమలకు అడ్డాగా ఉండకుండా చేయాలని కోరాడు. ఈ ఘటనపై మంగళకోట్ మున్సిపాలిటీ అధికారి సయ్యద్ బసీర్ స్పందించారు. వెంటనే ఆ ప్రాంతం మొత్తాన్ని శుభ్రం చేయించి.. దోమలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని బ్లాక్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఆ ప్రాంతంలో దోమల సమస్యను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని.. వీటితోపాటు మురుగు నీటిని వెంటనే అక్కడి నుంచి తరలించే పని చేస్తామని చెప్పారు. దోమల నివారణకు బ్లీచింగ్ పౌడర్ను పంపిణీ చేస్తామని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa